Alexei Navalny Death(International news in telugu): రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవినీతిపై అలుపెరగకుండా గళమెత్తిన విపక్ష అగ్రనేత అలెక్సీ నావల్నీ(47) జైలులో మృతి చెందారు. ఖార్ఫ్ పట్టణంలోని కారాగారంలో ఉన్న ఆయన.. శుక్రవారం నడక అనంతరం అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే స్పృహ కోల్పోయిన నావల్నీని వైద్యసిబ్బంది కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అవినీతిపై అవిశ్రాంత పోరు ఆయనొక్కడే కాడు.. పుతిన్ విరోధులు, విమర్శకులు అనూహ్యకర పరిస్థితుల్లో మరణించడం పెద్ద మిస్టరీగా మారింది. పుతిన్ అవినీతి సామ్రాజ్యం గురించి గత పదేళ్లలో నావల్నీ పలు వీడియోల ద్వారా గళమెత్తారు. ఆయన పరిశోధనాత్మక వీడియోలను ఆన్లైన్లో లక్షల సంఖ్యలో వీక్షించారు.
బిలియన్ డాలర్ల పుతిన్ ప్యాలెస్ నల్లసముద్రం సమీపంలో పుతిన్ నిర్మించుకున్న భవంతి గురించి 2021లో వెలుగులోకి తీసుకొచ్చారు. ఒక బిలియన్ డాలర్ల విలువ చేసే ఆ ప్యాలెస్.. రష్యా చరిత్రలోనే అతి పెద్ద లంచంగా నావెల్నీ అనుచరులు చెబుతుంటారు. ఆ ఒక్క వీడియోకే మూడేళ్లలో 130 మిలియన్ల వ్యూస్ లభించాయి.
Read more: హింసను సహించేదిలేదు.. ఇండియన్స్పై దాడిని ఖండించిన వైట్ హౌస్..
సన్నిహితులైనా సరే..
పుతిన్ ప్రత్యర్థులు, విమర్శకులే కాదు.. ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారి మరణాలు కూడా అనుమానాస్పదంగా నిలవడం గమనార్హం. కిరాయి సైనిక సంస్థ వాగ్నర్ అధినేత, ఒలిగార్క్ యెవ్గనీ ప్రిగాజిన్ ఇందుకు చక్కటి ఉదాహరణ.
తన అండదండలతో ఎదిగిన వారి నుంచి పోటీ తప్పదని పుతిన్ అనుమానిస్తే చాలు.. అంతుపట్టని రీతిలో వారు మృత్యుఒడికి చేరతానే వాదన ఉంది.
కిటికీ నుంచి జారిపడి..
2022లో భారత్కు వచ్చిన పుతిన్ పార్టీ సభ్యుడు, వ్యాపారవేత్త పావెల్ ఆంటోవ్(65) తాను బస చేస్తున్న హోటల్ గది కిటికీ నుంచి జారిపడి మరణించారు. ఉక్రెయిన్పై యుద్ధం తగదంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించినట్టుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాతే అనూహ్యంగా ఆంటోవ్ మృతి చెందారు. పుతిన్ స్నేహితుడు వ్లాదిమిర్ బుడనోవ్ కూడా హోటల్ గదిలోనే మరణించారు.
హత్యలు.. ఆకస్మిక మరణాలు
మరో ఒలిగార్క్ రవిల్ మాగనోవ్ మాస్కోలోని ఓ ఆస్పత్రి కిటికీ నుంచి జారిపడి మృత్యుఒడికి చేరారు. విపక్ష నేత బొరిస్ నెమత్సోవ్ 2015లో క్రెమ్లిన్కు సమీపంలోనే హత్యకు గురయ్యారు. జర్నలిస్టు అన్నా పొలిత్కోవ్స్కయా హత్యకు గురి కాగా.. కేజీబీ మాజీ ఏజెంట్ అలెగ్జాండర్ లిత్వినెంకో విషం ఇవ్వడం వల్ల మరణించారు. ఇలా పుతిన్ బద్ధ విరోధులు, ఒకప్పుడు స్నేహితులుగా మెలిగిన వారు, సన్నిహితులు ఒక్కొక్కరుగా మృత్యుఒడికి చేరుతుండటంపై ఎన్నో అనుమానాలున్నాయి.-