Minister Ponnam Prabhakar Fires on Opposition Leaders: గత ప్రభుత్వం సకల జనుల సర్వే నిర్వహించిందని.. కానీ.. దాని వివరాలను బయటపెట్టలేదని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ వివరాలను వాళ్ల నాయకుడికి అడిగే ధైర్యం కూడా బీఆర్ఎస్ నేతలు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తాము కులగణ చేస్తామంటే ఎందుకు అనుమానాలు వస్తున్నాయని ప్రశ్నించారు. పారదర్శకంగానే కులగణన చేపడతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష నేతలపై ఫైరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన.. శుక్రవారం అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారమే.. అసెంబ్లీలో కులగణనపై తీర్మానం చేశామన్నారు. కులగణనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తామెవ్వరికీ వ్యతిరేకం కాదని, అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నాకే కులగణనపై తీర్మానం చేశామని వివరించారు.
కానీ.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన గంగుల కమలాకర్ కులగణన తీర్మానంపై అనుమానం వ్యక్తం చేయడం శోచనీయంగా ఉందన్నారు. ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. సకలజనుల సర్వేను బయటపెట్టమని అడిగారా ? అని ప్రశ్నించారు. అనుమానాలను పక్కనపెట్టి.. ఇప్పటికే కులగణన చేసిన ఆయా రాష్ట్రాల గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు. మురళీధర్ కమిషన్ నుంచి తెలంగాణ ఉద్యమం, పార్లమెంట్ లో బిల్లు ఆమోదం వరకూ తాము ఉన్నామని తెలిపారు. మిగతా వారిలాగా తాము ఎగ్జిక్యూటివ్ ఆదేశాలకే పరిమితం కాలేదని.. చెప్పిన మాటప్రకారం సభలో తీర్మానం పెట్టామన్నారు. రాష్ట్రంలో కులగణనను ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అమలు చేస్తామన్నారు.
Read More: కాంగ్రెస్లోకి అల్లు అర్జున్ మామ.. కండువాకప్పి ఆహ్వానించిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి..
కాగా.. శాసనమండలి నిన్నటితో నిరవధిక వాయిదా పడగా.. 8వ రోజు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. నేటి సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే ఇరిగేషన్ పై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. రాష్ట్రానికి నీటి పంపకాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై నేడు కూడా అధికార-ప్రతిపక్షాల మధ్య వాడి-వేడి చర్చ జరగనుంది.