Lalu Prasad Yadav Interesting Comments: బిహార్లో మహా కూటమి అధికారం కోల్పోయిన కొన్ని వారాల తర్వాత ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పాత స్నేహితుడు నీతీశ్ కుమార్ (Nitish Kumar) కోసం ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంటాయని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ నిన్న బిహార్ అసెంబ్లీలో ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా పలకరించుకొని ఆత్మీయంగా మాట్లాడుకోవడం విలేకర్లను ఆకర్షించింది.
ఈ విషయంపై పట్నాలో లాలూ ప్రసాద్ యాదవ్ ని విలేకర్లు ప్రశ్నించారు. మీ కుమారుడు తేజస్వీని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసిన నీతీశ్తో ఇంకా సయోధ్యకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. దీనికి లాలూ స్పందిస్తూ నీతీష్ ను రానివ్వండి.. అప్పుడు చూద్దామని సమాధానం ఇచ్చారు. అయితే నీతీశ్కు ద్వారాలు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల తర్వాత ప్రధాని మోదీని పదవి నుంచి దించుతామని విశ్వాసం వ్యక్తంచేశారు. రాహుల్గాంధీలో ఎటువంటి లోపం లేదని.. ప్రధాని పదవికి అతను అర్హుడని పేర్కొన్నారు.
మరోవైపు లాలూ కుమారుడు ఆర్జేడీ నేత తేజస్వీ మాత్రం నీతీశ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సాసారమ్లో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఆయన మాట్లాడారు. బిహార్ సీఎం ఎవరి మాట వినే స్థితిలో లేరన్నారు. ప్రజలందరికీ సీఎం గురించి తెలుసన్నారు. ఆయన ఎవరి మాటా వినాలనుకోరన్నారు. ప్రాణాలు పోయినా బీజేపీతో కలవను అనేవారన్నారు. దీంతో 2024లో బీజేపీని ఓడించేందుకే.. మేం త్యాగాలు చేసి నీతీశ్తో ఉందామనుకొన్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆ వృద్ధ ముఖ్యమంత్రిని నియమించామని అన్నారు.
Read More: అసెంబ్లీలో విశ్వాస తీర్మానం.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్..
ఆర్జేడీ చీఫ్ వ్యాఖ్యలపై జేడీయూ అధికారిక ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడారు. నీతీష్ కోసం ద్వారాలు తెరిచే ఉన్నాయని లాలూ అన్నారు. కానీ, ఆయన ఓ విషయం తెలుసుకోవాలన్నారు. వాటికి ప్రఖ్యాత అలీగఢ్ తాళాలు వేసేశారన్నారు. ఆర్జేడీ తమతో అధికారం పంచుకొన్న ప్రతిసారీ అవినీతికి పాల్పడిందన్నారు. మళ్లీ వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదని ఆయన పేర్కొన్నారు.