Paytm-RBI (india today news):
పేటీఎంకు ఆర్బీఐ రిలీఫ్ ఇచ్చింది. మార్చి 15 వరకు లావాదేవీలకు కొనసాగించేందుకు కొంతకాలం వరకు సడలింపును ఇచ్చింది. పేటీఎమ్ కస్టమర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై విధించిన నిషేధాన్ని మార్చి 15కు సడలించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.
కస్టమర్ ఖాతాలపై టాపప్, క్రెడిట్ లావాదేవీలు, డిపాజిట్ల సేకరణ, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాల నిర్వహణ నిలిపివేత గడువును ఆర్బీఐ పొడగించింది. మర్చంట్లతోపాటు కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 15 రోజుల గడువు పెంచినట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ఈ నెల 29 తర్వాత ఖాతాదారుల నుంచి డిపాజిట్ల సేకరణ,టాపప్ రుణాలు, క్రెడిట్ లావాదేవీలు, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాలు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డుల లావాదేవీలు నిర్వహించొద్దని ఆర్బీఐ గత నెల 31న పీపీబీఎల్ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా మర్చంట్లతోపాటు ఖాతాదారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి పేటీఎం మరికొంత సమయం కేటాయించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలియజేసింది. పీపీబీఎల్ కస్టమర్లు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా నగదు విత్ డ్రా చేసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
పేటీఎం వాలెట్లు, పేమెంట్స్ ద్వారా రూ.కోట్లలో మోసపూరిత లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలను ఎదుర్కొంది. దీనిపై బయటి ఆడిటర్లు ఇచ్చిన అడిట్ నివేదిక ఆధారంగా పేటీఎం అనుబంధ పీపీబీఎల్ పై చర్యలు తీసుకున్నది. పీపీబీఎల్లో పర్యవేక్షణా లోపాలు ఉన్నాయని తేలడంతోనే దానిపై మరింత రెగ్యులేటరీ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆర్బీఐ వివరించింది.