Confidence Motion In Delhi assembly: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ ఆరోసారి కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది. గతంలో ఐదుసార్లు నోటీసులు ఇచ్చినప్పుడు ఆయన విచారణకు హాజరుకాలేదు. ఆరోసారి దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చిన సమయంలో వ్యూహాత్మకంగా అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పెట్టడం ఆసక్తిగా మారింది.
విశ్వాస పరీక్షకు సిద్ధమైన వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.కేంద్రంపై నిప్పులు చెరిగారు. తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. రాష్ట్రాల్లోని పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం చూస్తున్నామంటూ బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. మద్యం పాలసీ కేసు నెపంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తన ఎమ్మెల్యేలు ఎవరూ జారీ పోలేదని కేజ్రీవాల్ స్పష్టంచేశారు. ఈ విషయాన్ని స్పష్టం చేసేందుకే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ విషయాలను ప్రజలకు చూపించేందుకు తాను సిద్ధమయ్యానని చెప్పారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది.
Read More: ఆస్పత్రిలో ప్రియాంక గాంధీ.. భారత్ జోడో న్యాయ యాత్రకు దూరం..
మరోవైపు బీజేపీ నేతలపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో ఎమ్మెల్యేను రూ.25 కోట్లకు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారని ఇద్దరు ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకొచ్చారని వివరించారు. తనను అరెస్టు చేసి ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ మద్యం కేసు నకిలీదని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు. ఈడీ ఫిర్యాదు చేయడంతో ఫిబ్రవరి 17న విచారణకు హాజరు కావాలని ఇటీవల రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్ తో బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.