farmhouse case: ఫాంహౌజ్ కేసులో దూకుడు పెంచింది తెలంగాణ సర్కారు. కేసు విచారణకు ఆరుగురు పోలీస్ అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సిట్ సభ్యులుగా.. రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైం డీసీపీ కమలేశ్వర్, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, మొయినాబాద్ సీఐ లక్ష్మీనారాయణలను నియమించింది.
ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కేసులో తగ్గేదేలే.. వదిలేదే లే.. అన్నట్టు జోరు మీదుంది సర్కారు. ఇన్నాళ్లూ హైకోర్టు స్టే కారణంగా కేసు విచారణ కాస్త ఆలస్యం అవగా.. తాజాగా న్యాయస్థానం స్టే ఎత్తివేసి, దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దూకుడు పెంచింది. విచారణకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఎమ్మెల్యేల ట్రాప్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఫాంహౌజ్ వీడియోలను సీఎం కేసీఆర్ దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలకు, అన్ని పార్టీలకు పంపించి.. ఇష్యూను జాతీయ స్థాయిలో హైలెట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ముగ్గురు నిందితుల సంభాషణలో అమిత్ షా, బీఎల్ సంతోష్ ల పేర్లు పదే పదే రావడంతో.. ఈ కేసును పకడ్బందీగా దర్యాప్తు చేయాలని డిసైడ్ అయింది. తమ పార్టీ ఎమ్మెల్యేలనే కొనేందుకు వస్తారా? అని చాలా సీరియస్ గా తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఫాంహౌజ్ కేసు సమగ్ర విచారణకు సిట్ ఏర్పాటు చేసి.. మొత్తం గుట్టును బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ముగ్గురు నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని లోతుగా ప్రశ్నించనుంది సిట్. దర్యాప్తులో ఎలాంటి సంచలనాలు వెలుగుచూస్తాయోననే ఆసక్తి అందరిలోనూ.