BRS Leaders Joined In Congress(Telangana politics): తెలంగాణ కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీత… కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్లో చేరారు.
బీఆర్ఎస్ నాయకుడు, అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం హస్తం గూటికి చేరారు. తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు. ఈ నేతలు సీఎం రేవంత్రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తామని స్పష్టం చేశారు.
పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు బీఆర్ఎస్ టిక్కెట్ దక్కలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనపై గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన రోహిత్ రెడ్డి..ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
Read More: తెలంగాణ అసెంబ్లీలో కులగణన తీర్మానం.. సూచనలివ్వాలని ప్రతిపక్షాలను కోరిన సీఎం..
2023 ఎన్నికల్లో టిక్కెట్ దక్కపోవడంతో మహేందర్ రెడ్డి అలకబూనారు. అయితే ఆయనకు ఎన్నికల కొద్దిరోజుల ముందు మంత్రి పదవి ఇచ్చి గులాబీ బాస్ కేసీఆర్ బుజ్జగించారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం మహేందర్ రెడ్డి చర్చలు జరిపి ఆయనను పార్టీ నుంచి వెళ్లకుండా కాపాడుకుంది. కానీ మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో మహేందర్ రెడ్డి కారు దిగిపోయారు. కాంగ్రెస్ లో చేరిపోయారు.
బొంతు రామ్మోహన్ కూడా బీఆర్ఎస్ అధిష్టానంపై చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. గతంలో హైదరాబాద్ మేయర్ గా అవకాశం దక్కినా.. ఆ టర్మ్ పూర్తైన తర్వాత ఆయనకు పార్టీలో కీలకమైన పదవులు ఏమీ దక్కలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉప్పల్ టిక్కెట్ ను బొంతు రామ్మోహన్ ఆశించారు. చాలా ప్రయత్నాలు చేశారు. కానీ టిక్కెట్ దక్కించుకోలేకపోయారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న బొంతు పార్లమెంట్ ఎన్నికల వేళ కారు దిగిపోయారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని భావించారు. తన అల్లుడు అల్లు అర్జున్ కూడా ప్రచారానికి వస్తాడని ప్రకటించారు. కానీ గులాబీ బాస్ కేసీఆర్ చంద్రశేఖర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు.