Pakistan Native Seema Haider Wants To Walk To Ayodhya: అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. విదేశీయులు కూడా అయోధ్యను సందర్శించి బాల రాముడిని దర్శించుకుంటున్నారు. తాజాగా ఓ పాకిస్థాన్ మహిళ కూడా అయోధ్యలోని రాముడిని కాలినడకన వచ్చి దర్శించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అనుమతి కోరింది. దీంతో ఇప్పుడు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సీమా హైదర్.. ఈ పేరు చాలా మంది భారతీయులకు గుర్తుండే ఉంటుంది. పాకిస్థాన్కు చెందిన సీమా హైదర్ కరోనా సమయంలో ఉత్తర్ప్రదేశ్కు చెందిన సచిన్ మీనాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారంది. దీంతో పిల్లల్ని తీసుకుని అక్రమంగా భారత్లోకి ప్రవేశించింది. ఆపై సీమా హైదర్ పోలీసులకు పట్టుబడటం.. తాను పాక్ వెళ్లనని, ఇక్కడే సచిన్ మీనాను పెళ్లి చేసుకుంటానని పేర్కొంది. భారత పౌరసత్వం కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం విషేశం.
Read More: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. ఇద్దరు మృతి
ఈ సంఘటనలు కొన్ని నెలల క్రితం జరిగాయి. అయితే ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా. ఆమె తనదైన వ్యాఖ్యలు, చర్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకున్న బాల రాముడిని కలినడకన దర్శించుకోవాలని భావిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. మరోసారి సీమా హైదర్ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయింది.
ఇలా రాముడిని దర్శించుకొవటానికి అనుమతి ఇవ్వాలని ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుతం సీమా హైదర్ సచిన్ మీనాతో కలిసి నోయిడాలో నివసిస్తోంది. అక్కడి నుంచే అయోధ్యకు పాదయాత్ర చేయనున్నట్లు లేఖలో పేర్కొంది. సీమా హైదర్ కృష్ణుడి భక్తురాలిని అని తెలిపింది.
ఈ క్రమంలోనే సీమా హైదర్ వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న సుందరకాండ పఠిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక తాను పూర్తిగా హిందువుగా మారినట్లు తెలిపింది. పాకిస్థాన్లో ఉన్నప్పడు కూడా హిందువుల పండుగలను రహస్యంగా చేసుకునేదాన్నని సీమా హైదర్ వెల్లడించింది.
మరోవైపూ సీమా హైదర్ తరఫు లాయర్ ఏపీ సింగ్ ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలను వెల్లడించారు. సీమా హైదర్ అయోధ్యకు వెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియ త్వరలో పూర్తి కాబోతుందని తెలిపారు. తన కుటుంబ సభ్యులందరితో కలిసి అయోధ్యలోని బాల రాముడిని దర్శించుకుంటానని సీమా హైదర్ తాజాగా మీడియాకు చెప్పింది. నోయిడాలోని రబుపురా గ్రామం నుంచి అయోధ్య వరకు దాదాపు 645 కిలోమీటర్ల మేర పాదయాత్రను చేపట్టేందుకు సీమా హైదర్ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.