CAG Report On Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో కనీస టికెట్ ధర మూడు రూపాయలు. రూ. 40 చెల్లిస్తే చాలు ఒక్క రోజులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎన్నిసార్లైనా ప్రయాణం చేయొచ్చు. మెట్రో ఏర్పాటుకు ముందు కుదిరిన ఒప్పందంలో పేర్కొన్న అంశం మాత్రమే ఇది. అయితే మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే సమయానికి సీన్ రివర్స్ అయింది. టికెట్ ధరలు పెంచినట్లు కాగ్ (CAG) ఆడిట్ వెల్లడించింది.
హైదరాబాద్ మెట్రోలో రెండు కిలోమీటర్ల ప్రయాణానికి టికెట్ ధర రూ. 3. అదే సమయంలో రూ.40 చెల్లిస్తే చాలు ఒక్క రోజులో ఎన్నిసార్లైనా మెట్రోలో ప్రయాణించొచ్చు. ఈ ఆఫర్ భలే ఉందే అనుకుంటున్నారా? వాస్తవానికి ఇది అసలు ఆఫరే కాదు. మెట్రో రైలు నిర్మాణం మొదలుపెట్టే సమయంలో కుదిరిన ఒప్పందంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అయితే మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చే సమయంలో మాత్రం ఒప్పందానికి విరుద్ధంగా టికెట్ ధరలను అధికంగా నిర్ణయించారు.
Read More: కీలక దశకు శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసు.. ఐఏఎస్ లకు బిగుస్తున్న ఉచ్చు
అధిక ఛార్జీలను వసూలు చేయడంతో 2017 నవంబర్ నుంచి 2020 మార్చి వరకు హైదరాబాద్ మెట్రో నిర్మాణ సంస్థ ప్రయాణికుల దగ్గర్నుంచి అదనంగా రూ.213.77 కోట్లు వసూలు చేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) వెల్లడించింది. కారిడార్ -3లో నాగోల్ నుంచి అమీర్పేట వరకు సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సక్రమంగా తయారు చేయకపోవడంతో అంచనా వ్యయం రూ.1232 కోట్లకు పెరిగిందని కాగ్ వెల్లడించింది.
ఒప్పందానికి విరుద్ధంగా విస్తీర్ణం తగ్గించి మెట్రో స్టేషన్లను నిర్మించడంతో మెట్రో సంస్థకు రూ.227.19 కోట్ల లబ్ధికి చేకూరిందని కాగ్ తెలిపింది. మెట్రో స్టేషన్లలో పార్కింగ్ కోసం 25 చోట్ల 57 ఎకరాలను అప్పగిస్తే.. 11 ప్రాంతాల్లో 33 ఎకరాల్లో మాత్రమే పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు కాగ్ తెలిపింది.
మెట్రో రైలుకు కేటాయించిన భూముల్లో నిర్మించిన మాల్స్ మెట్రో రైలు సేవలు ప్రారంభించిన తర్వాతే అద్దెకు లేదా లీజుకు ఇవ్వాలని ఒప్పందంలో పేర్కొన్నారు. కానీ మెట్రో రైలు మొదలు కాక ముందే వాటిని లీజుకు ఇచ్చేశారు. దీంతో మెట్రో నిర్మాణ సంస్థకు లాభం కలిగిందని పేర్కొన్నారు.
జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో నిర్మాణం సాకారం కాలేదని కాగ్ పేర్కొంది. ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండడంతో ఖర్చు పెరిగిందని.. ప్రయాణికుల సంఖ్య కూడా ఆశించిన స్థాయిలో రాలేదని కాగ్ తెలిపింది.
కాగ్ తెలిపిన వివరాలను పక్కనబెడితే.. మిగతా నగరాల్లో మెట్రో టికెట్ కనీస ధర రూ.10గా ఉంది. ఒక్క గుర్గావ్లోనే కనీస టికెట్ ధర రూ.20గా ఉందని సమాచారం. 2002లో ఢిల్లీ మెట్రో ప్రారంభమైనప్పుడు కనీస టికెట్ ధర రూ.4 కాగా.. గరిష్ట ధర రూ.4గా ఉండేది. 2017లో కనీస ధరను పది రుపాయలకు పెంచారు.
హైదరాబాద్ మెట్రో ఏర్పాటైన ఐదేళ్ల తర్వాత.. 2022 చివర్లో టికెట్ల ధరలు పెంచడానికి ప్రయత్నాలు చేశారు. కానీ మాజీ మంత్రి కేటీఆర్ టికెట్ ధరల పెంపు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మెట్రో ఏర్పడిన నాటి ధరలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రోజుకు 5 లక్షల మంది హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. రద్దీ వేళల్లో మెట్రో రైళ్లలో నిలబడానికి చోటు కూడా ఉండటం లేదు. దీంతో కోచ్ల సంఖ్య పెంచుతామని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపింది. కోచ్ల సంఖ్య పెరగడంతోపాటు మెట్రో విస్తరణ కూడా జరిగితే ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.