Uk- Japan Fell Into Recession (news paper today):
బ్రిటన్(UK), జపాన్(Japan) ఆర్థిక వ్యవస్థలు మాంద్యం(recession)లోకి జారుకున్నాయి. 2023 చివరి మూడు నెలల్లో ఆర్థిక పరిస్థితులు క్షీణించాయి. ఇరు దేశాల్లో వరుసగా రెండు త్రైమాసికాల్లో పరిస్థితి అలాగే ఉంది. ఆర్థిక మాంద్యానికి ఇది సంకేతం. వరుసగా రెండు త్రైమాసికాల్లో మందగమనం నమోదైతే దానిని మాంద్యంగా పరిగణిస్తారు. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో బ్రిటన్, జపాన్ దేశాల జీడీపీల్లో 0.3, 0.4 శాతం మేర క్షీణత నమోదైంది. వాస్తవానికి బ్రిటన్ జీడీపీ క్షీణత 0.1 శాతంగా ఉండొచ్చని అంచనా వేసినా.. అంతకు మించి క్షీణత చోటు చేసుకొంది. ఎన్నికల ఏడాదిలో ప్రధాని రిషి సునాక్ కు ఇది పెద్ద షాకే అని చెప్పాలి.
Read More : షేర్ల పతనం.. ఈడీ నోటీసులు..! పేటీఎంకు డబుల్ షాక్..
జపాన్ సైతం ఆర్థిక మాంద్యంలోకి జారుకోవడంతో.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మూడో స్థానంలో ఉన్న ఆ దేశం నాలుగో స్థానానికి చేరింది. మూడో స్థానానికి జర్మనీ ఎగబాకింది. మరోవైపు, అమెరికాలో ఆర్థిక వృద్ధి వరుసగా ఆరో త్రైమాసికంలో కొనసాగింది. నిరుడు నాలుగో త్రైమాసికంలోనూ వృద్ధి నమోదైంది. ప్రజల వినిమయం ఇందుకు దోహదపడింది. కరోనా, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనతో సత్ఫలితాలే లభించాయి.
నిరుడు మన దేశ ఆర్థిక వ్యవస్థ వండర్స్ చేసింది. భారత వృద్ధిని వివిధ అంతర్జాతీయ సంస్థలు సైతం ప్రశంసించాయి. అయితే ఈ ఏడాది మాంద్యం భయాలు కనిపించవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలోనే హెచ్చరించింది. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఆహారం, ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ అనిశ్చితి నేపథ్యంలో మనకూ రెసిషన్ తప్పదనే భయం వెన్నాడుతోంది.