Shiva Balakrishna Case Update : నోట్ల కట్టల గుట్టలు.. అక్రమాస్తుల చిట్టాలు.. తవ్వేకొద్ది బయటపడుతున్న పెద్ద వ్యక్తుల పేర్లు.. ప్రస్తుతం HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసు విచారణలో బయటపడుతున్న విషయాలు. అంతేకాదు పెద్దల అండదండ లేనిదే ఈ రేంజ్లో అవినీతి సాధ్యం కాదనే విషయాన్ని నిజం చేస్తూ ఇప్పుడు ఇద్దరు ఐఏఎస్ అధికారుల మెడకు చుట్టుకుంటోంది ఈ కేసు. మొత్తంగా చూస్తే శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ కీలక దశకు చేరుకుంది. అతనిచ్చిన స్టేట్మెంట్.. దొరికిన ఆధారాలను బట్టి చూస్తే ప్రస్తుతం ఐఏఎస్లు అర్వింద్ కుమార్, నవీన్ మిట్టల్కు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ ఇద్దరు ఐఏఎస్లకు కూడా నోటీసులు పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఏసీబీ. అంతేకాదు నవీన్ మిట్టల్ భూ దందాలపై కూడా ఏసీబీ గురి పెట్టింది. అయితే నెల రోజులుగా అర్వింద్ కుమార్ హైదరాబాద్లో లేరు. అరవింద్ కుమార్తో కలసి శివబాలకృష్ణ.. డబుల్ డీల్స్ సెట్ చేసినట్లు సమాచారం. MAUD లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా అరవిందకుమార్ ఉండగా.. అదే విభాగంలో డైరెక్టర్ హోదాలో బాలకృష్ణ పనిచేశారు. ఒకే ఫైళ్లను ఇద్దరు.. రెండు సార్లు రెండు హోదాల్లో పరిశీలించి.. డబుల్ ఇన్ కమ్ పొందినట్లు విచారణలో తేలింది. DTCP, GHMCలలో కూడా అరవింద్ కుమార్ తో కలసి డైరెక్టర్ లు ఫైల్స్ క్లియర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. CCP విచారణపైనా అధికారుల దృష్టి సారించారు.
Read More : విద్యకు 10 నుంచి 12 శాతం నిధులిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ..
మరో వైపు శివ బాలకృష్ణ ఆస్తులకు సంబంధించి లోతుగా ఆరాతీస్తున్న ఏసీబీ.. ఆస్తులు, భూములు ఇంకా ఏమైనా ఉన్నాయా? అని సమాచారం సేకరిస్తుంది. ఈ వ్యవహారంలో ఆయన బినామీలను సైతం ఏసీబీ అధికారులు విచారణ చేశారు. మరోవైపు శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్కు ఏసీబీ కోర్టులో షాక్ తగిలింది. నవీన్ కుమార్ బెయిల్ పిటిషన్ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టేసింది.
HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసును విచారిస్తున్న ACB.. స్కామ్ల పుట్టను కదిలిస్తున్నట్టు కనిపిస్తోంది. HMDA భూముల వేలంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ అక్రమాలకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందిందని.. దీంతో పాటు భూముల వేలంపాటలు ఆపాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు మళ్లీ భూముల వేలం నిర్వహించొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టు తెలుస్తుంది.
Read More : ఆసరా పింఛన్ల పంపిణీలో గోల్ మాల్.. కాగ్ నివేదిక లో వెల్లడి..
అంతేకాదు వేలం పూర్తైన భూములపై కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ భూఅక్రమాల వ్యవహారంలో కొందరు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్టు ఇప్పటికే ప్రచారం మొదలైంది. గతంలో నిర్వహించిన భూముల వేలంలో అప్పట్లో హెచ్ఎండీఏలో పనిచేసిన శివబాలకృష్ణ పాత్రపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏలో ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న అధికారిని తనిఖీల సమయంలో ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
గతంలో జరిగిన వేలంపాటల్లోనూ బాలకృష్ణ చక్రం తిప్పారని తెలుస్తోంది. భూముల వేలానికి సంబంధించి రియల్ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లకు ముందే సమాచారం అందించేవారని.. వారికే ఆ భూములు దక్కేలా చక్రం తిప్పేవారని తెలిసింది. భూముల వేలానికి ముందే పలు రియల్ సంస్థలతో కొందరు కీలక అధికారులు కుమ్మకై అవినీతి దందాకు తెరలేపినట్టు బయటపడింది. ఒక కీలక అధికారి అయితే ఇతర శాఖల్లోని ఉద్యోగులను డిప్యుటేషన్పై HMDAకి తీసుకొచ్చి లబ్ధి పొందినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని తెలుస్తున్నది.
గత ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున సర్కార్ భూముల్ని వేలం వేశారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి వేలంపాటలు చేపట్టారు. ప్రభుత్వ భూములతో పాటు ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి కూడా పెద్ద మొత్తంలో భూములను సేకరించి లేఅవుట్లు వేశారు. కోకాపేట మొదలుకొని బాటసింగారం, ప్రతాప సింగారం, ఉప్పల్ భగాయత్ వంటి ప్రాంతాల్లో పెద్దఎత్తున భూముల్ని సేకరించారు. బుద్వేల్, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లోనూ లేఅవుట్లు వేశారు. ఎన్నికలకు ముందే ఈ భూ దందాపై ఆరోపణలు వచ్చాయి.