Violent Mob Attacks SP Office In Manipur’s Churachandpur District : మణిపూర్ లో మళ్ళీ అల్లర్లు రాజుకున్నాయి. తాజాగా భద్రతాదళాలు, సాయుధ ఆందోళకారుల మధ్య గురువారం రాత్రి చెలరేగిన ఘర్షణలో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. సాయుధ ఆందోళనకారులతో ఒక హెడ్ కానిస్టేబుల్ దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ చర్యను ఖండిస్తూ ఆందోళనకారులు పెద్దెత్తున నిరసనకు దిగారు.
మణిపూర్లోని చురచందాపూర్ జిల్లాలో కుకి-జో తెగలకు చెందిన ఆందోళనకారులు హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్ నిరసిస్తూ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈసందర్బంగా ఆందోళనకారులు ఒక బస్సుకు నిప్పంటించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో ఎస్పీ కార్యాలయంపై నిరసనకారులు పెద్దెత్తున రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరు పౌరులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 25 మంది గాయపడ్డారు. సుమారు 400 మందికి పైగా అల్లరిమూకలు ఈ నిరసనలో పాల్గొనగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు వారిని చెదరగొట్టాయి.
Read More : ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవదహనం
తమ గ్రామాలపై పోలీసుల దాడులు తరచూ పెరుగుతున్నాయని కుకీ-జో తెగలు ఆరోపిస్తున్నాయి. తమ గ్రామాల రక్షణకు ఏర్పాటు చేసుకున్న వాలంటీర్లపై వారు జులుం ప్రదర్శిస్తున్నారని వారు పేర్కొన్నారు. తాజాగా జరిగిన అల్లర్లకు కూడా చురచందాపూర్ ఎస్పీ పూర్తి బాధ్యత వహించాలని కుకి-జో తెగకు చెందిన ఇండెజినెస్ ట్రైబల్ ఫోరమ్ డిమాండ్ చేసింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన ప్రతిసారి తమగ్రామాలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. వారిపై ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు విమర్శిస్తున్నారు.
విశ్రాంత సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కొలోనెల్ నెక్టర్ సంజెంబమ్ తనను చంపుతానని బెదిరించారని కుకి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నేత తాంగటిన్లెన్ డానియెల్ మేట్ ఫిర్యాదు చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసినా ఇంతవరకూ చేయలేదని ఆరోపించారు. అర్థరాత్రి ఫోన్ చేయడంతో తాను ఎత్తలేదని, దీంతో ఆ అధికారి తన ఫోన్ కు టెక్స్ట్ మెసేజ్ పెట్టారని తెలిపారు. “నీవు ఎక్కడ వుందీ నాకు తెలుసు.. నిన్ను చంపడానికి వస్తున్నా” అని ఆ మెసేజ్ లో హెచ్చరించారని పేర్కొన్నారు. 2015లో మయన్మార్ లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ లో ఎస్పీ నెక్టర్ కీలక పాత్ర పోషించారు. ఆయన రిటైరైన తర్వాత మళ్లీ అయిదేళ్ల సర్వీసు కొనసాగిస్తూ మణిపూర్ ప్రభుత్వం ఆయనను కంబాట్ విభాగంలో సీనియర్ ఎస్పీగా నియమించింది. ఎస్పీ నెక్టర్ కీర్తి చక్ర, శౌర్యచక్ర గాలంట్రీ అవార్డులను కూడా సాధించారు.