Fire Accident in Delhi(Telugu news live today): దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అలీపూర్ లో ఉన్న ఓ పెయింట్ ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడు కారణంగా.. మంటలు చెలరేగి.. 11 మంది సజీవదహనమయ్యారు. మంటలు అదుపులోకి వచ్చినా.. మరికొందరి ఆచూకి తెలియకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గురువారం సాయంత్రం అలీపూర్ దయల్ పూర్ మార్కెట్ లో ఉన్న ఓ పెయింట్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగి.. మంటలు చెలరేగాయి. ఇవి క్రమంగా చుట్టుపక్కల ఇళ్లకు, దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 5 గంటల సమయంలో తమకు సమాచారం అందగా.. 22 ఫైరింజన్లతో అతికష్టం మీద రాత్రి 9 గంటల వరకూ మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి ఒకరు వెల్లడించారు.
Read More : నేడు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల పిలుపు..
మంటలు అదుపులోకి వచ్చాక.. కాలిన స్థితిలో ఉన్న మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చినా.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఫ్యాక్టరీలోని రసాయనాల కారణంగానే పేలుడు సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడిన దట్టమైన పొగ.. ఆ ప్రాంతం మొత్తాన్నీ కమ్మేసింది. క్షతగాత్రుల్లో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.