Rathasaptami in Tirumala : ప్రపంచానికి వెలుగునందించే సూర్య భగవానుడి జయంతి రథసప్తమి వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా ఇవాళ ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. పవిత్ర మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి అంటారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహిస్తారు. దీనినే ఒక్క రోజు బ్రహ్మోత్సవాలు అని కూడా పిలుస్తారు.
Read Also : ప్రణతోస్మి.. దివాకరమ్..!
రథసప్తమి వేడుకల సందర్భంగా తెల్లవారుజామున ఐదున్నర గంటల నుంచి శ్రీవారి సేవలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహన సేవ, హనుమంత వాహన సేవ, చక్రస్నానం, కల్పవృక్ష వాహన సేవ, సర్వభూపాల వాహన సేవ, చంద్రప్రభ వాహనంపై మొత్తం 7 వాహనాలపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రస్తుతం సూర్యప్రభ వాహనం ఊరేగుతున్నారు.
రథసప్తమి సందర్భంగా.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతిగృహాలు కూడా దొరకడం కష్టతరంగా మారింది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి.. క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. ఏటీజీ గెస్ట్ హౌస్ వరకూ భక్తులు బారులు తీరారు. సర్వదర్శనం క్యూలైన్ లో ఉన్నవారికి స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టిటిడి వెల్లడించింది. గురువారం 45,825 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. వారిలో 21,380 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చింది.