Mangalagiri Politics(AP political news): మంగళగిరి వైసీపీ టికెట్ పంచాయతీ ఇప్పట్లో తేలేటట్లు కనిపించడం లేదు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే.. జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ బాట పట్టారు. దాంతో వచ్చే ఎన్నికలకు మంగళగిరిలో బీసీ కార్డు ప్రయోగించడానికి నిర్ణయించిన వైసీపీ. గంజి చిరంజీవిని ఇన్చార్జ్గా ప్రకటించింది. అయితే ఎన్నికల్లో పోటీ చేసేది ఆయనేనా? అన్న కన్ఫ్యూజన్ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. అక్కడ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు తామే అభ్యర్ధులమని చేస్తున్న హడావుడితో .. అసలు కేండెట్ ఎవరన్నది క్లారిటీ లేకుండా పోయింది.
సీఎం జగన్ నివాసముండే నియోజకవర్గం మంగళగిరిలో గత రెండు సార్లు వైసీపీ అభ్యర్ధే ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో అమరావతి సెంటిమెంట్తో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేసినప్పటికీ.. మంగళగిరిలో వైసీసీ హావేనే కొనసాగింది. ఈ సారి కూడా లోకేశ్ అక్కడ నుంచే పోటీకి సిద్దమయ్యారు. దాంతో అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది మంగళగిరి సెగ్మెంట్.
గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా రెండో సారి గెలిచిన ఆర్కే పార్టీని వీడటంతో మంగళగిరిలో బీసీ కార్డు ప్రయోగానికి తెర లేపారు సీఎం జగన్.. స్థానికంగా చేనేత వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో.. అదే వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవిని ఇన్చార్జ్గా ప్రకటించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే ఇప్పుడు చిరంజీవి ఎన్నికల బరిలో ఉంటారో? లేదో? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ శ్రేణుల్లో.
మంగళగిరి వైసీపీ టికెట్పై సోషల్ మీడియాలో పెద్ద యుద్దమే నడుస్తోంది. మూడు వర్గాలు టికెట్ తమకు ఖాయమైనట్లు ప్రచారం చేసుకుంటున్నాయి. గంజి చిరంజీవితో పాటు.. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి మరుగుడు హన్మంతరావు వర్గాలు తమ నేతకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం హోరెత్తిస్తున్నాయి. దాంతో అక్కడి వైసీపీ శ్రేణులు ఎవరి వెంట నడవాలో అర్ధంకాక అయోమయానికి గురవుతున్నారు.
Read More: ఆచంట.. రాజుగారి చింత!
సమన్వయకర్తగా చిరంజీవిని నియమించిన దగ్గర్నుంచి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అవి విఫలం అవ్వడంతో ఎమ్మెల్యే అనుచర గణాన్ని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి. నియోజకవర్గంలో ప్రతి గడపగడపకు వెళుతూ ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఆశించిన ఆదరణ లభించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.
బీసీ నేత గంజి చిరంజీవి తన ప్రయత్నాల్లో తాను ఉంటే.. అదే వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టికెట్ రేసులోకి వచ్చి వైసీపీ పెద్దలతో లాబీయింగ్ మొదలుపెట్టారు. కమలతోపాటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు సైతం తన కోడలిని ఎన్నికల బరిలో దించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తనకు పరిచయం ఉన్న పార్టీ పెద్దల దగ్గర ఒక్క ఛాన్స్ ఇవ్వమని మొరపెట్టుకుంటున్నారంట.
అలా నియోజకవర్గంలో మూడు ముక్కలాట మొదలవ్వడంతో.. పార్టీ శ్రేణులు ఎవరి వెంట నడవాలో అర్ధంకాక.. అందరి చుట్టూ తిరుగుతూ పబ్బం గడుపుకుంటున్నారంట. మరి లోకేశ్ను ఓడించాలని పట్టుదలగా ఉన్న వైసీపీ పెద్దలు ఆ ముగ్గురిలో ఎవరిని కరుణిస్తారో కాని.. లోకేశ్ని ఓడించడం తరువాత.. ముందు మీరు అభ్యర్థిని ఫైనల్ చేయండని టీడీపీ నేతలు సెటైర్లు విసురుతున్నారు. మరి తాడేపల్లి ప్యాలెస్లోని బాస్లు ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి.