Former Minister Ranganathraju News(Andhra politics news): పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే రంగనాథరాజుపై సొంతపార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తొలి టర్మ్లో మంత్రిగా కూడ పనిచేసిన రంగనాథరాజు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని వైసీపీ శ్రేణుల భగ్గమంటున్నాయి. ఆయన ఒంటెద్దు పోకడలతో అటు ప్రజావ్యతిరేకత పెరగడంతో పాటు.. పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతింటోందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. ఆయన్ని తప్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఆచంటలో ఓడిపోవడం ఖాయమని వైసీపీ పెద్దలకు నివేదికలు కూడా పంపుతున్నారంట. దాంతో ఆచంట రాజుగారి పరిస్థితి అర్ధం కాకుండా తయారైందిప్పుడు.
పశ్చిమగోదావరి జిల్లా అచంట నియోజకవర్గం వైసీపీలో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి రంగనాథరాజుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రంగనాథరాజు ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేసినప్పటికీ.. నియోజకవర్గానికి చేసిందేమీ లేదని.. కనీసం పార్టీ బలోపేతానికి కూడా పనిచేయలేదని వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తిరిగి టికెట్ ఇస్తే.. సెల్ఫ్గోల్ చేసుకున్నట్లే అని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు గుప్పిస్తున్నాయి.
రంగనాథరాజుకి కాకుండా ఎవరికీ సీటు ఇచ్చిన తమకి ఓకే అంటూ రోడెక్కుతున్నారు వైసీపీ నేతలు.. మాజీ మంత్రి రంగనాథరాజు ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం జరుగుతుందని ప్రెస్మీట్లు పెట్టి మరీ ప్రకటిస్తున్నారు. దాంతో ఆచంట వైసీపీలో ముసలం రచ్చకెక్కింది. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకిత భావంతో పని చేసిన నాయకులను ఎమ్మెల్యే రంగనాథరాజు పట్టించుకోరని. ఆయనకు అడుగులకు మడుగులొత్తే వారికే నియోజకవర్గంలో పదవులు దక్కి.. పనులు అవుతున్నాయని అసంతృప్తి నేతలు మండిపడుతున్నారు.
నియోజకవర్గంలో వర్గాలను పెంచి పోషించి.. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మిగిలినవారిని అణగదొక్కుతున్నారని ఆరోపిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయన్ని పక్కనపెట్టి.. ఏ కులానికి సీటు ఇచ్చినా గెలిపించుకుంటామని.. లేకపోతే గెలుపుపై గ్యారెంటీ ఇవ్వలేమని ఓపెన్గా చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా.. మాజీ మంత్రి రంగనాథ రాజు సొంత పార్టీ కార్య కర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారన్నది ఆయన వ్యతిరేకుల ఆరోపణ. ఆచంటలో శ్రీరంగ నాధరాజు గెలుపు కోసం పనిచేస్తే తనపైనే అట్రాసిటీ కేసు పెట్టించారని సాక్షాత్తు వైసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు వైట్ల కిషోర్ ప్రెస్ మీట్ పెట్టి మరి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
అయోధ్య లంక గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకున్నా.. అక్కడ ప్రత్యేకంగా చేసిందేమీ లేదని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులున్నాయన్న అహంకారంతో ఆయన కార్యకర్తలు, నాయకులను పట్టించుకోవడం లేదని.. పార్టీలో ఉంటే ఉండండి. పోతే పోండి అన్నట్లు వ్యవహరిస్తుంటారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఐదేళ్లలో ఆచంట నియోజకవర్గంలో వైసీపీ మండల కమిటీ మీటింగ్ కూడా పెట్టలేకపోయిన ఎమ్మెల్యే గా రంగనాథరాజు రికార్డులకు ఎక్కుతారన్న సెటైర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి.
Read More: చిత్తూరు జిల్లాలో పొలిటికల్ డ్రామా.. హాట్ టాపిక్ గా మారిన డీకే ఫ్యామిలీ రాజకీయం..
క్షేత్రస్థాయిలో చూస్తే ఆచంట నియోజకవర్గంలో అసలు అభివృద్ధి ఊసే కనిపించదన్న అభిప్రాయం ఉంది. సీఎం జగన్ ప్రతిష్టాత్మకం గా తీసుకున్న సచివాలయాల నిర్మాణం కూడా అక్కడ పూర్తి కాలేదు. రంగనాథరాజు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేసినా.. పెదమల్లం , కోడేరు , శేషన్నచెరువు గ్రామాల్లో ఇళ్ల స్ధలాలు ఇవ్వలేదని.. కనీసం భూ సేకరణ కూడా జరగకపోడవం చూస్తే రంగనాధ రాజు పనితీరు అర్దమవుతుందని అంటున్నారు.
అసలు రంగనాధరాజు ఇంకా తాను రాజరికం వ్యవస్థలోనే ఉన్నట్లు భావిస్తుంటారని.. పార్టీ కార్యకర్తలను పురుగుల్లా చూస్తారని.. డబ్బు హోదా ఉన్నవారికే రంగనాధ రాజు కార్యాలయంలో గౌరవం ఉంటుందని.. అటువంటి వారికే ఆయన అపాయింట్మెంట్ ఇస్తారని.. సామాన్య ప్రజలు కూడా అంటున్నారంటే ఆయన రాచరికం ఏ రేంజ్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు.
అంతేకాక రైస్ మిల్లర్స్తో ఆర్ధిక గొడవలు.. అధికారులపై అందరి ముందు చిరాకు పడటం.. తన మాట కాదన్న ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేయించడం ఆయనకు రోటీన్ అయిపోయాయంట.. అటు అభివృద్ధి పరంగా ప్రజలకు చేసిందేమీ లేక.. ఇటా పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగంతో గ్యాప్ పెంచుకున్న రంగనాథరాజుకి మళ్లీ టికెట్ ఇస్తే.. తాము చేతులెత్తేస్తామంటోది ఆయన వ్యతిరేకవర్గం.. మరి ఆచంట రాజుగారి విషయంలో వైసీపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.