Chandrababu Questioned YCP Government: విలేకరి పరమేశ్వరరావుపై ఇసుక దొంగలు చేసిన దాడిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అడ్డగోలు ఇసుక దోపిడీని వెలుగులోకి తెస్తే ప్రాణాలు తీస్తారా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ సీఎం అయిన నాటి నుంచి వైసీపీ అక్రమాలకు అడ్డూఅదుపులూ లేకుండా పోయిందన్నారు. వారి అక్రమాలను ఎండగడుతున్న మీడియా ప్రతినిధులపై దాడులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు.
పరమేశ్వరరావుపై దాడి చేసిన గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగుతున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలు ఎన్జీటీకి నివేదికలు ఇచ్చాయన్నారు. ఇంత జరగుతున్నా కలెక్టర్లు కూడా పట్టనట్లు వ్యవహరించడం దారుణమని ఆయన ద్వజమెత్తారు. అధికార వైసీపీ నేతల ఇసుక మాఫియాపై భవిష్యత్తులో చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.