India vs England 3rd Test Live Updates: ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమ్ ఇండియా పటిష్ట స్థితికి చేరుకుంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఒకదశలో 8.5 ఓవర్లలో 33 పరుగులకి 3 వికెట్లు పడిపోయిన క్లిష్ట దశ నుంచి రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుని ముందుకు నడిపించాడు. తనకి రవీంద్ర జడేజా అద్భుతమైన సెంచరీతో సపోర్ట్ అందించాడు. ఇక డెబ్యూ మ్యాచ్ తోనే సర్ఫరాజ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. వన్డే తరహాలో ఆడి 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తూ రన్ అవుట్ అయి, నిరాశగా వెనుతిరిగాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ నిర్ణయం తప్పేమో అని అంతా అనుకున్నారు. ఎందుకంటే టపటపా మూడు వికెట్లు పడ్డాయి. రెండో టెస్ట్ లో డబుల్ సెంచరీ సాధించిన స్టార్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ (10) ఈసారి నిరాశపరిచాడు. శుభ్ మన్ గిల్ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇన్నిరోజులు ప్రాక్టీసుకి సమయం దొరికి కూడా, గిల్ డక్ అవుట్ అయి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.
కొత్తగా జట్టులోకి వచ్చిన రజత్ పటేదార్ (5) ఇంకా తన స్థాయికి తగిన ప్రతిభను చూపించలేదు. బహుశా మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడకపోతే ఇబ్బందికర పరిస్థితి తప్పేలా లేదు. ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాతో కలిసి జట్టుని మళ్లీ పట్టాలెక్కించాడు. తన సహజశైలికి విరుద్ధంగా ఆడి, తలకు దెబ్బ తగిలించుకు మరీ సెంచరీ చేశాడు.
Read more : ఎవరైనా ఇలా కోరుకుంటారా? రోహిత్ పై ఒక నెటిజన్ తీవ్ర వ్యాఖ్యలు..
196 బాల్స్ ఎదుర్కొని 3 సిక్సర్లు, 14 ఫోర్ల సాయంతో 131 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజాతో కలిసి నాలుగో వికెట్ కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించి టీమ్ ఇండియాను పటిష్టస్థితికి తీసుకువెళ్లాడు.
అయితే 29 పరుగుల వద్ద రోహిత్ శర్మకు లైఫ్ వచ్చింది. టామ్ హర్ట్లీ బౌలింగ్లో షాట్కు యత్నించగా ఎడ్జ్ తీసుకుని బాల్ స్లిప్ దిశగా వెళ్లింది. కానీ అక్కడే ఉన్న జో రూట్ అందుకోలేకపోయాడు. కాసేపటికే అండర్సన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అంపైర్ ప్రకటించాడు. కానీ రోహిత్ రివ్యూ కోరాడు. థర్డ్ అంపైర్ నాటౌట్గా వెల్లడించాడు. దీంతో బతుకుజీవుడా అనుకుంటూ ఇంక పొరపాట్లు చేయకుండా సెంచరీ దిశగా సాగిపోయాడు.
అయితే ఈరోజు మ్యాచ్ లో మరో గొప్ప ప్రదర్శన చెప్పుకోవల్సి ఉంది. ప్రమోషన్ పై వచ్చిన రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి సెంచరీ సాధించడమే కాదు నాటౌట్ గా నిలిచాడు. 212 బాల్స్ ఎదుర్కొని 2 సిక్స్ లు 9 ఫోర్ల సాయంతో 110 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ రావడంతో ఆట స్వరూపమే మారిపోయింది. అంతవరకు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారని అంతా అనుకున్నారు, కానీ దానిని వన్డే స్టయిల్ లో మార్చి పారేశాడు. ధనా ధనా ఫోర్లు కొట్టి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. 66 బాల్స్ లో 1 సిక్స్, 9 ఫోర్ల సాయంతో 62 పరుగులు చేసి అనూహ్యంగా రన్ అవుట్ అయిపోయాడు.
రవీంద్ర జడేజా కారణంగా సర్ఫరాజ్ ఖాన్ రన్ అవుట్ అయిపోయాడు. నిజానికి జడేజా క్రీజులో ఉంటే, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తను చాలా స్పీడుగా కదులుతా ఉంటాడు. అందువల్ల తనని అనుక్షణం గమనిస్తూ ఉండాలి. లేదంటే రన్ అవుట్ కావడం సహజమని అంటుంటారు. ఎందుకంటే తొలిటెస్ట్ లో ఇలాగే జడేజా కారణంగా రన్ అవుట్ అయి అశ్విన్ తెగ తిట్టుకుంటూ వెళ్లాడు. అయితే సర్ఫరాజ్ ఉన్నంతవరకు ఇంగ్లాండ్ బౌలర్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తను అవుట్ కావడంతో ఊపిరిపీల్చుకున్నారు.
మొత్తానికి కులదీప్ యాదవ్ వచ్చి 1 పరుగు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమ్ ఇండియా 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, టామ్ హార్ట్ లీ 1 వికెట్టు పడగొట్టారు.