raja singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. అయితే, ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కండిషన్ పెట్టింది. మీడియాతో మాట్లాడవద్దని, ర్యాలీలు చేపట్ట రాదని ఆదేశించింది. హైకోర్టు బెయిల్ తో 57 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు రాజాసింగ్.
మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఆయనపై పీడీ యాక్టు ప్రయోగించి జైలుకు తరలించారు.
రాజాసింగ్ పై పీడీ యాక్టు నమోదు చేసి జైలుకు తరలించడంపై ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు సమంజసమేనంటూ.. రాజాసింగ్ పై 100కు పైగా కేసులు ఉన్నాయంటూ.. అడ్వకేట్ జనరల్ వాదించారు. సమగ్ర విచారణ అనంతరం రాజాసింగ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
ఇదే విషయంలో రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. షోకాజ్ నోటీసులు జారీ చేయగా.. తనపై కుట్ర చేశారంటూ రాజాసింగ్ వివరణ కూడా ఇచ్చారు. అయితే, రాజాసింగ్ వివరణ తర్వాత కూడా బీజేపీ అధిష్టానం ఆయనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేటు వేయకుండా.. అలాగని తిరిగి పార్టీలో చేర్చుకోకుండా.. వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది.