CM Revanth Reddy At Sevalal Birth Anniversary Celebrations: హైదరాబాద్ లో సేవాలాల్ జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ విగ్రహానికి పూలమాలుల వేశారు. ఆయనకు నివాళులు అర్పించారు.
బంజారాలను ఎస్టీల్లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ చేర్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అందువల్లే సివిల్ సర్వీసుసహా అనేక ఉన్నతమైన ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఆదివాసీలు తెలంగాణలో ఉద్యమంలో చురగ్గా పాల్గొన్నారు. సీతక్కకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించామని చెప్పారు. సంత్ సేవాలాల్ జయంతి రోజు ఆఫ్షనల్ హాలీడే ఇచ్చామన్నారు.
సేవాలాల్ జయంతి ఉత్సవాలకు రూ. 2 కోట్లు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తండాల్లో సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసిందని విమర్శించారు. అన్ని తండాల్లో , గూడెలాల్లో పాఠశాలలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అన్ని తండాల్లో బీటీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు.
Read More: ఆ లోటు భర్తీ చేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ..
ఎవరీ సేవాలాల్..?
బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్. నాగరిక సమాజానికి దూరంగా అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు. బంజారాల ఆలోచన, జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చారాయన. సాంఘిక సమానత్వం కావాలని ఆకాంక్షించారు. బంజారాలు ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నారు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని గడ్డమాంగలూరు గ్రామానికి చెందిన రామావత్ భీమా నాయక్, ధర్మిణి దంపతుల తొలిసంతానం సంత్ సేవాలాల్ మహరాజ్. ఆయన 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి బళ్లారిలోని గుత్తి రాంజీనాయక్ తండాలో జన్మించారు. సేవాలాల్ చిన్నతనం నుంచి భక్తి భవాలు కలిగి ఉన్నారు. గిరిజనులను ఏకం చేసేందుకు జాతి సన్మార్గంలో పయనించేలా ఆధ్యాత్మిక ప్రచారం నిర్వహించారు.
సేవాలాల్ మహరాజ్ మహిమలను నవాబ్ ఉస్మాన్ పాషా నమ్మారట. అందుకే హైదరాబాద్ లో కొంత ప్రాంతాన్ని ఇచ్చారని అంటారు. అదే నేటి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అని చెబుతుంటారు. అలా బోధనలు చేస్తూ సేవాలాల్ మహరాజ్ మహారాష్ట్రలోని రాయగాడ్ జిల్లాలో సమాధి అయ్యారు.
సేవాలాల్ మహరాజ్ సమాధి రాయగాడ్ బంజారాల పుణ్యక్షేత్రంగా పేరుపొందింది. ఈ ప్రాంతాన్ని పౌరఘడ్, సేవాఘడ్గా పిలుస్తారు. ప్రతి తండాలో తప్పనిసరిగా సేవాలాల్ మహరాజ్ మందిరాన్ని నిర్మించికున్నారు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో గిరిజనులు పయనిస్తున్నారు.