Jyotirlinga for Each Zodiac Sign: ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆయా గ్రహాలు, నక్షత్రాలు ఉన్న స్థితిని బట్టి జాతక చక్రాన్ని తయారుచేస్తారు. ఆ జాతకంలో ఆ వ్యక్తి జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి ఆధారపడి ఉంటుంది. జన్మ సమయంలో ఏవైనా దోషాలున్నవారు, తమ తమ రాశిని బట్టి దేశంలోని ఆయా జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని జ్యోతిషులు సూచిస్తున్నారు.
మేషరాశి కుజునికి స్వగృహం. చరరాశి వారికి పదకొండవ రాశ్యాధిపతి శని బాధకుడు. కనుక మేషరాశి వారు రామేశ్వరంలోని రామనాథ స్వామిని దర్శించుకోవాలి. శ్రీరాముడు.. శని బాధా నివారణార్థం ఈ లింగాన్ని స్థాపించాడని ప్రతీతి.
వృషభరాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్ఛ రాశి. వీరు తమ జాతక దోషాల నివారణకు సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవటం, తమ జన్మ నక్షత్రం రోజున ఆ లింగానికి రుద్రాభిషేకం చేయిస్తే.. జాతక దోషాలు తొలగిపోతాయి.
మిధునరాశి బుధునికి స్వగృహం. ఈ రాశివారు తమ జాతక దోషాల నివారణకు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. వీరు శని సంచారకాలంలో ఇక్కడ కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపిస్తే విశేష ఫలితాలు ఉంటాయి.
కర్కాటక రాశి చంద్రునికి స్వగృహం. వీరు ఓంకారేశ్వరంలోని జ్యోతిర్లింగాన్ని దర్శించటంతో బాటు తమ జన్మనక్షత్రం రోజున ఓంకార బీజాక్షరాన్ని జపించటం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు.
సింహరాశి సూర్యునికు స్వగృహం. వీరు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవటంతో బాటు ఓం నమ:శివాయ మంత్రాన్ని జపించటం వల్ల సర్వదోషాల నుండి విముక్తులు కావచ్చు.
కన్యారాశికి అధిపతి బుధుడు. వీరు పూజించాల్సిన జ్యోతిర్లింగం.. శ్రీశైల మల్లికార్జునుడు. మల్లికార్జునుడి దర్శనం, భ్రమరాంబాదేవికి కుంకుమపూజతో బాటు వీరు తమ జన్మనక్షత్రం రోజున శ్రీశైలంలో చండీ హోమం చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
తులారాశికి శుక్రుడు అధిపతి. వీరు ఉజ్జయినిలోని మహా కాళేశ్వర లింగాన్ని పూజించటంతో బాటు శుక్రవారపు సూర్యోదయ వేళ మహా కాళేశ్వర స్త్రోత్రాన్ని పారాయణ చేయటం వల్ల గ్రహదోషాల నుండి, బాధల నుండి విముక్తి పొందవచ్చు.
వృశ్చికరాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారు వైద్యనాథేశ్వర లింగాన్ని దర్శించి పూజించటంతో బాటు ప్రతి మంగళవారం రోజున వైద్యనాథేశ్వరుని స్త్రోత్ర పారాయణ చేయటం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు.
ధనూరాశికి అధిపతి గురుడు. ఈ రాశి వారు వారణాసిలోని విశ్వేశ్వర లింగాన్ని దర్శించి, పూజించాలి. అలాగే.. వీరు గురువారం రోజున, శనగల దానం చేయటం వల్ల శని, గురు దోషాలు వదిలిపోతాయి.
మకర రాశికి అధిపతి శని. వీరు భీమశంకర లింగాన్ని పూజించటంతో బాటు శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయటం, వికలాంగులకు, వృద్ధులకు వస్త్ర దానం చేయడం, భీమశంకర స్త్రోత్రాన్ని పారాయణ చేయటం వల్ల విశేష ఫలితాన్ని పొందవచ్చు.
కుంభరాశికి అధిపతి శని. ఈ రాశి వారు కేదారేశ్వర లింగాన్ని దర్శించుకుని పూజించాలి. దీనివల్ల ఈ రాశి వారికున్న గ్రహ పీడలు, శత్రు బాధలు, ఇతర అన్ని దోషాలు తొలగిపోతాయి. ఈ రాశివారు శనివారం రుద్రాభిషేకం చేస్తే మంచిది.
మీనరాశికి అధిపతి బృహస్పతి. ఈ రాశి వారు నాసిక్లోని త్రయంబకేశ్వర లింగాన్ని దర్శించుకోవాలి. వీరు స్వామి వారి ఫోటోను పూజా మందిరంలో ఉంచుకోవటంతో బాటు నిత్యం త్రయంబకేశ్వరుడి స్త్రోత్రాన్ని పారాయణ చేయాలి.