Farmers Protest in delhi(Live tv news telugu): ఢిల్లీలో రైతులు ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఢిల్లీ చలో కార్యక్రమం మూడో రోజుకు చేరింది. రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్ ఆధ్వర్యంలో పంజాబ్లో రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాకులను రైతులు దిగ్బందించారు. రైల్వే ట్రాకులపై కూర్చొని భారత్ కిసాన్ యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. తమ డిమాండ్లను నెరవేరే వరకూ వెనక్కి తగ్గేదే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు.
మరోవైపు రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. చండీగఢ్లో సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు జరపనుంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని కేంద్రం పిలిచినట్టు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ పంధర్ తెలిపారు.
అటు.. రైతులపై పంజాబ్లో ఎస్ఎల్ఆర్ బుల్లెట్లు, టియర్ గ్యాస్, ప్లాస్టిక్ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించడం సరికాదని సర్వన్ సింగ్ పంధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా నిరసనలో భారత్ కిసాన్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. గురువారం రాకేష్ టికాయత్, నరేష్ టికాయత్ ఆధ్వర్యంలో పంజాబ్లో రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాకులను రైతులు దిగ్బంధించారు.
రైతుల పట్టుదల చూస్తే డిమాండ్లు నెరవేరే వరకూ వెనక్క తగ్గేలా కనిపించడం లేదు. పంజాబ్, హరియాణా సరిహద్దులోని శంభు వద్ద వేల మంది రైతులు మోహరించారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది. బుధవారం ఢిల్లీవైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ట్రై చేయగా పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. దీనికిపై ప్రతిగా కొందరు రైతులు రాళ్ల దాడి చేశారు.
Read More:షేర్ల పతనం.. ఈడీ నోటీసులు..! పేటీఎంకు డబుల్ షాక్..
శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై పెద్దఎత్తున గుంతలు తవ్వారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా, తమ డిమాండ్లు నెరవేరే వరకూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం వెర్షన్ మరోలా ఉంది. రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని, వాటిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
పోలీసుల దాడులను ముందుగానే అంచనా వేసిన రైతులు పక్కా ప్లాన్తోనే ఆందోళనలకు దిగారు. బాష్ప వాయువు నుంచి వచ్చే పొగనుంచి రక్షణ కోసం నీళ్ల ట్యాంకులను రైతులు తెచ్చి పెట్టుకున్నారు. నీళ్ల సీసాలను, తడి బట్టలను సిద్ధంగా చేసుకున్నారు. మరికొందరైతే శరీర రక్షణ పరికరాలను, కళ్ల రక్షణ అద్దాలనూ ధరించారు. రైతుల ఆందోళనలతో హర్యానాలోని అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో వాయిస్ కాల్స్ మినహా మిగతా అన్ని మొబైల్ సేవలను నిలిపివేశారు. గురువారం కూడా మొబైల్ సేవలను రద్దు చేశారు.