Paytm Share Price Down: పేటీఎంను రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో షేర్ మార్కెట్ లో తీవ్ర నష్టాలను ఆ సంస్థ చవిచూస్తోంది. మరోవైపు విదేశీ ట్రాన్సాక్షన్ల డిటైల్స్ ఇవ్వాలని ఈడీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బ్యాంకు లావాదేవీలు నిర్వహించిన కస్టమర్ల వివరాలను ఈడీ సహా ఇతర దర్యాప్తు సంస్థలు సేకరించే పనిలో ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ బుధవారం స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం ఇచ్చింది.
ముఖ్యంగా విదేశీ ట్రాన్సాక్షన్ల డేటా ఇవ్వాలని పేటీఎం పేమెంట్స్ బ్యాంకును ఈడీ కోరిందని తెలుస్తోంది. ఇటీవల వన్ 97 కమ్యూనికేషన్స్ పై ఈడీ విచారణ ప్రారంభించింది. విదేశీ మారక నిబంధనల ఉల్లంఘనలపై ఆరా తీస్తోంది. విదేశీ లావాదేవీల నిబంధనలను ఉల్లంఘించామన్న ఆరోపణలను పేటీఎం మాత్రం తోసిపుచ్చుతోంది.
దర్యాప్తు సంస్థల అధికారులు కోరుతున్న వివరాలు, డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు ఇస్తున్నామని పేటీఎం వెల్లడించింది. విదేశీ ట్రాన్సాక్షన్ల వివరాలు అందించాలని నోటీసుల పంపిన విషయంపై అటు పేటీఎంగానీ, ఇటు ఈడీగానీ స్పందించలేదు. మరోవైపు పేటీఎం పేమెంట్స్ బ్యాంకు డేటా సమర్పించాలని ఆర్బీఐను ఈడీ ఇప్పటికే కోరింది. ఇప్పుడు దేశీయ, విదేశీ ట్రాన్సాన్లకు వివరాలు సేకరించడం ఉత్కంఠను రేపుతోంది.
మరోవైపు మార్కెట్లలో పేటీఎం షేర్లు రోజురోజుకు పతనమవుతున్నాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 10 శాతం మేర నష్టపోయింది. పేటిఎం షేర్ ధర రూ. 355 వద్ద ప్రారంభమైన రూ. 342. 15 వద్ద ముగిసింది. మదుపర్లు తమ వద్ద ఉన్న పేటీఎం షేర్లను అమ్మేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే 52 వారాల కనిష్ఠ స్థాయికి పేటీఎం షేర్ పడిపోయింది.