India vs England 3rd Test Preview: భారత్-ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్ లో జరగనున్న మూడో టెస్ట్ లో గెలిచేదెవరు? ఓడెదెవరు? అని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నేటి నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఫేవరెట్ గా దిగనుంది. అలాగే ఇంగ్లాండ్ ఇప్పటివరకు బజ్ బాల్ వ్యూహాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. బహుశా ఇక్కడగానీ వాళ్లు ఆ దిశగా ఆడితే, టీమ్ ఇండియా దగ్గర ఆన్సర్ ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆ ప్రయోగం చేసింది. కానీ త్వరత్వరగా వికెట్లు పడటంతో ప్లాన్ మార్చి సంప్రదాయ టెస్ట్ మ్యాచ్ తరహాలో ఆడుకుంటూ వెళ్లింది. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కూడా
ఆ ప్రయత్నం జరిగింది. వికెట్లు త్వరత్వరగా పడి పరాజయం పాలైంది.
ఇప్పుడు రాజ్ కోట్ లో బజ్ బాల్ వ్యూహంతో వస్తే టీమ్ ఇండియా బౌలర్లు బుమ్రా, సిరాజ్, అశ్విన్, అక్షర్ పటేల్, కులదీప్ నిలువరించగలరా? అనే ప్రశ్న నెట్టింట వినిపిస్తోంది. రవీంద్ర జడేజా జట్టులోకి వస్తే అక్షర్ పటేల్ లేదా కులదీప్ బెంచ్ పైకి వెళతారు. అయితే టీమ్ ఇండియాలో అంతా కొత్తవాళ్లే కాబట్టి ఆల్ రౌండర్లు ఇద్దరినీ ఆడించే అవకాశాలున్నాయి. ఈ లెక్కన చూస్తే కులదీప్ కి అవకాశం రాకపోవచ్చునని అంటున్నారు.
రాజ్ కోట్ లో ఇప్పటివరకు రెండు టెస్ట్ మ్యాచ్ లు జరిగాయి. 2016లో ఇదే ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రా అయ్యింది. 2018లో వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది.
ప్రస్తుతం సిరీస్లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు మూడో టెస్టులో విజయం సాధించి ఆధిక్యం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. దాదాపు సగం జట్టుపైనే అనుభవం లేనివారితో టీమ్ ఇండియా బరిలోకి దిగుతుంటే అందుకు రివర్స్ గా అనుభవజ్ణులతో ఇంగ్లాండ్ ముందడుగు వేస్తోంది. ఎవరిది పైచేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.