Rayalaseema YCP news(Andhra pradesh political news today): గ్రేటర్ రాయలసీమ గత ఎన్నికల్లో వైసీపికి పట్టం కట్టింది. అక్కడ ఉన్న అన్ని సామాజికవర్గాలు అండగా నిలవడంతో సీమలో వైసీపీ గణనీయమైన సీట్లు సాధించింది. ముఖ్యంగా అక్కడి రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తి అయిన బలిజ సామాజిక వర్గం జగన్ పార్టీకి కొమ్ముకాచింది. అయితే ఈసారి టికెట్ల విషయంలో ఆ సామాజిక వర్గానికి అధికారపక్షం మొండిచేయి చూపించడంతో ఆ వర్గం నాయకులు గుర్రుగా ఉన్నారంట. ఆ కుల పెద్దలు రంగంలో దిగి తమకు జరిగిన అన్యాయంపై క్షేత్ర స్థాయి పోరాటానికి సిద్దం అవుతుండటం ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.
ఏపీ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ఓట్లు ఎంత కీలకమో వేరే చెప్పనవసరం లేదు. రాయలసీమలో వారి ఓట్లు ఎన్నికల ఫలితాలను నిర్ధేశించే స్థాయిలో ఉంటాయి. అయితే సీమలో వారు బలిజలుగా చెలామణిలో ఉంటారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని కొన్ని నియోజకవర్గాలలో వారు ఎటు మొగ్గితే ఆ పార్టీదే విజయం.. ఈ జిల్లాలకు సంబంధించి గత ఎన్నికల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వైసీపీ నుంచి విజయం సాధించారు.
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వెణుగోపాల్, చిత్తూరు ఎమ్మెల్యే అరణీ శ్రీనివాసులు బలిజ సామాజికవర్గ నాయకులే.. అయితే ఈ సారి అభ్యర్థుల మార్పులు చేర్పులు అంటున్న వైసీసీ వారిద్దరి సీట్లు గల్లంతు చేసింది. అంతేకాదు ఆ ఆరు జల్లాల్లోని 74 నియోజకవర్గాల్లో ఎక్కడా ఆ వర్గానికి అవకాశం కల్పించలేదు. పైపెచ్చు బలిజ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు స్థానాల్లో రెడ్డి నేతలకు పెద్ద పీట వేసింది. చిత్తూరు నుంచి విజయానందారెడ్డి, దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్రెడ్డిలకు అవకాశం కల్పించింది.
గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఏకంగా పాతిక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. అత్యదికంగా చిత్తూరు జిల్లాలో అయితే ఏకంగా మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో విసృత స్థాయిలో కనిపిస్తారు. రాజంపేట ఎంపీ సీటు పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని తిరుపతి, గూడూరు, కాళహస్తి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేని నిర్ణయించేది ఆ ఓటర్లే.
Read More: సీఎం జగన్ కి షాక్ తగలనుందా..? వైసీపీకి వేమిరెడ్డి గుడ్ బై చెప్పనున్నారా..?
కర్నూలు జిల్లాలో అళ్ళగడ్డ , నంద్యాల, కర్నూలు సిటీ, ఎమ్మిగనూరు, అదోనిలలో కూడా ప్రభావం చూపిస్తారు. గత ఎన్నికల్లో వారి మద్దతులో అత్యధికంగా లబ్ధి పొందింది వైసీపీ.. అయితే ఈసారి ఆ సామాజిక వర్గ నేతలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై వారిలో ఆగ్రహానికి కారణమవుతోంది. దీనికితోడు చిత్తూరు ఎంఎల్ ఎ అరణీ శ్రీనివాసులకు రాజ్యసభ ఇస్తామన్న హామీతో చిత్తూరు టికెట్ గల్లంతు చేసి.. చివరి నిముషంలో హ్యాండ్ ఇవ్వడంతో ఆ వర్గీయులు మరింత రగిలిపోతున్నారంట.
దీంతో ఇప్పుడు అయా సామాజిక వర్గ నేతలు రోడ్డెక్కుతున్నారు. బలిజ వర్గానికి చెందిన చిత్తూరు వైసీపీ కార్పొరేటర్లు.. తమ జాతికి అన్యాయం జరిగిందని, తమ సామాజిక వర్గాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. గ్రేటర్ రాయలసీమ కాపు సంఘం అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తీవ్ర స్థాయిలో వైకాపా తీరును ఎండగట్టారు.
బలిజల విషయంలో అధిష్టానం తీరుపై వైసీపీ సీనియర్ నాయకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజంపేట పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగనూరు అసెంబ్లీ , రాజంపేట పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేస్తుంది. ఆ లోక్సభ సీటు పరిధిలోని మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబల్లపల్లి, రాజంపేట, రైల్వే కొడూరు నియోజకవర్గాలలో మెజారటీ ఓటర్లు బలిజలే.. వారి ఓట్లు దూరమయితే పార్టీకి ఇబ్బందే అన్న ఆందోళన పెద్దిరెడ్డి శిబిరంలో కనిపిస్తోందంట.
అలాగే తిరుపతి, చిత్తూరు ఎంపీ స్థానాల్లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బలిజల ప్రాబల్యం కనిపిస్తుంది. అంత బలమైన ఓటు బ్యాంకు ఉన్న వారికి రెండు సీట్లు కూడా కేటాయించకపోవడం.. ఆయా స్థానాల్లో కూడా సొంత వర్గానికే వైసీపీ పెద్ద పీట వేయడంపై.. ఆ పార్టీ శ్రేణుల్లోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేల పేరుతో అభ్యర్ధులను మార్చడంపై వైసీపీ సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఆ వర్గానికి చెందిన కుల సంఘాల నేతలు.. తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బలిజలపై వైసీపీ వివక్ష చూపిస్తోందన్న ప్రచారాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకు వెళ్లేపడ్డారు. మరో వైపు టీడీపీ రాజంపేట పార్లమెంటు స్థానంతో పాటుతో పాటు రాజంపేట, నెల్లూరు అసెంబ్లీ స్థానాలతో పాటు పాటు చిత్తూరు, తిరుపతి ఎంపీ సీట్ల పరిధిలో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఆ వర్గానికే రిజర్వ్ చేసిందంటున్నారు. వాటితో పాటు జనసేన కు కేటాయించే సీట్లలో వారికి ప్రాతినిధ్యం ఖాయమంటున్నారు. ఏదేమైనా అంత బలమైన ఓటు బ్యాంకు వర్గాన్ని వైసీపీ బాస్ ఎందుకు అలక్ష్యం చేస్తున్నారనేది సమాధానం లేని ప్రశ్నగా మారిందని.. ఈ పార్టీ నేతలు జుట్లు పీక్కుంటున్నారంట.