Sai Baba’s rules of food: సకల లోకాలకూ మూలమైన ఆ అనంత శక్తి.. మనిషి ఆలోచనకు, అంచనాకు అంత సులభంగా అందదు.
Sai Baba’s rules of food: సకల లోకాలకూ మూలమైన ఆ అనంత శక్తి.. మనిషి ఆలోచనకు, అంచనాకు అంత సులభంగా అందదు. ఏ రూపమూ లేని, ఏ గుణమూ లేని ఆ పరమాత్మ సాయిబాబా రూపంలో గురువుగా షిరిడీలో అవతరించారు. మనిషి భగవంతుడిని చేరటానికి కావలసిన అనేక మార్గాలను బాబా తన జీవితకాలంలో భక్తులకు సూచించారు. వాటిలో అన్నదానం యొక్క మహిమను బాబా పలు సందర్భాల్లో వివరించారు.
బాబా షిరిడీలో ఉన్నకాలంలో తానే స్వయంగా భక్తులకు పెద్ద పెద్ద గుండిగలలో అన్నం వండి అన్నదానం చేసేవారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమనీ, దానిని నువ్వు తిని, మరో నలుగురికి పెట్టుకోవటం కంటే పుణ్యం లేదని బాబా అనేవారు.
స్వయంగా వండి, దానిని గొప్ప ప్రేమతో, ఆదరంతో పెట్టమని చెప్పేవారు. ‘మన గడపలోకి ఎవరు, ఎప్పుడొచ్చినా, వారిని అతిథులుగా భావించి అన్నం పెట్టమని, గృహస్థులు చేయగల గొప్ప మనుష్య యాగం ఇదేనని బాబా సాయిచరిత్రలోని 19వ అధ్యాయములో వివరించారు.
అలాగే.. తన భక్తులు ఏది ఆదరంగా ఇచ్చినా తాను స్వీకరిస్తానని బాబా చెప్పేవారు. కొందరికి దేవుని ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు ‘మేం ఉపవాసం ఉన్నాము గనుక తర్వాత తింటాము’ అంటుంటారని, అలా అనటమంటే.. ఆ దేవతను నిరాదరించటమేనని బాబా భావించేవారు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప లభించని దైవ ప్రసాదాన్ని నిస్సంకోచంగా వెంటనే స్వీకరించాలనీ, ఆ అనుగ్రహాన్ని అనుభూతి చెందాలనేది బాబా భావన.
అలాగే.. భోజనం చేసే వేళలో, ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో పనిమీద బయటికి వెళ్లరాదని బాబా అనేవారు. అలాగే.. దారిలో ఎవరైనా పలకరించి, ప్రేమతో ఫలహారం పెడితే తిరస్కరించ రాదని, దానిని శుభ శకునంగా భావించి స్వీకరిస్తే.. కార్యం నెరవేరుతుందని సాయిచరిత్ర 32వ అధ్యాయంలో బాబా తెలిపారు.
ఒంటరిగా కూర్చొని అన్నం తినరాదని, వెంట మరొక వ్యక్తి లేదా కనీసం పశు పక్ష్యాదులనైనా అతిథులుగా భావించి వాటికి కూడా కాస్త పెట్టి తినమని బాబా బోధించారు. అప్పటికీ ఎవరూ లేకపోతే.. తనను స్మరించుకుని, రెండు మెతుకులు అర్పించి తినమని సూచించారు.
ఉపవాసం అంటే దైవంతో మమేకమై ఉండటమనీ, ఈశ్వరుని చింతనలో గడపటమనీ, సర్వ ప్రాణుల్లో ఈయనను దర్శించుకోవటమనీ బాబా బోధించేవారు. అంతేగానీ.. ఏమీ తినకపోవటం ఉపవాసం కాదని ఆయన భావన.
అందుకే బాబా ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు. ఎవరినీ ఉపవాసం ఉండమనీ చెప్పలేదు. అన్ని ఇంద్రియాలూ బలంగా, చైతన్యంతో ఉంటేనే భగవంతుని మీద మనసు నిలుస్తుందని అనేవారు. ‘కడుపులో అన్నం పడకుండా.. నువ్వు దేవుడిని చూడలేవు. ఆయన మహిమను పొగడలేవు? ఆయన ఉపదేశాన్ని కూడా శ్రద్ధగా వినలేవు అనేవారు.
బాబా రోజూ నిద్రలేచి, ముఖం కడుక్కొని ధునిలో కట్టెలు వేసి, భుజానికి జోలె, చేతిలో భిక్షా పాత్ర పట్టుకుని 5 ఇళ్లకు భిక్షకు వెళ్లేవారు. మధ్యాహ్నానికి మరోసారి భిక్షకు వెళ్లేవారు. భిక్షలో దొరికిన పదార్థాలను మసీదులో 2 పాత్రల్లో వేయగా, వాటిలో ఒక పాత్రలోనివి మసీదు తుడిచే మహిళ, భక్తులూ తీసుకుపోయేవారు. రెండోదానిలోనివి కుక్కలూ పిల్లులూ కాకులూ హాయిగా తినేవి. తనకోసం భక్తులు తెచ్చే రకరకాల ఫలహారాలు తెచ్చినా.. బాబా చివరి వరకు భిక్ష మానలేదు. ఎందుకంటే.. అన్నదాన ఫలితాన్ని తన భక్తులకు ఇచ్చేందుకే.