CM Revanth Reddy Fires on KCR(Breaking news in telangana): మేడిగడ్డ మొత్తం కుంగిపోయి ఉంటే.. చూడటానికి కూడా రాని బీఆర్ఎస్ సభ్యులు.. బ్యారేజీ కుంగుబాటుకు కాంగ్రెస్సే కారణమని ఎలా మాట్లాడుతారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫైరయ్యారు. ఆరవ రోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. కాళేశ్వరంపై చర్చ ప్రారంభమవ్వగా.. కాళేశ్వరం విషయంలో గోరంతను కొండంత చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కాళేశ్వరం ద్వారా అనేక రిజర్వాయర్లు వచ్చాయని, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకున్నామని అన్నారు. ఇప్పుడు మేడిగడ్డను చూపించి.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దని అన్నారు.
ఇరిగేషన్ పై తెలంగాణ అసెంబ్లీలో రసాభాస జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి.. సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న కేసీఆర్ మాట్లాడిన తీరును తప్పుబట్టారు. ఏం పీకడానికి మేడిగడ్డ వెళ్లారని అనడం సబబు కాదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్యాంట్ ఊడపీకారని, ఉన్న అంగీని కూడా ప్రజలు పీకేస్తారన్నారు. ముఖ్యమంత్రిని ఏం పీకడానికి వెళ్లారని అనడంపై రేవంత్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడిన తీరుపై చర్చించేందుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వస్తే.. రేపు సాయంత్రం వరకూ చర్చించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామన్నారు. చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం లేదన్నారు. మేడిగడ్డపై ప్రజలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నారని విమర్శించారు.
Read More : కోరం మెంబర్స్ పై కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య వాదన.. పెళ్ళిళ్లున్నాయ్ త్వరగా కానివ్వండి..
మేడిగడ్డ బ్యారేజీ చూడటానికి మేడిపండులా ఉందని దుయ్యబట్టారు. మేడిగడ్డ కుంగిపోతే నీళ్లు నింపడం ఎలా సాధ్యమవుతుందని బీఆర్ఎస్ సభ్యుల్ని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, కేసీఆర్ లకే మేడిగడ్డ బాధ్యతల్ని అప్పగిస్తామని, మేడిగడ్డలో నీళ్లు నింపి.. అన్నారం, సుందిళ్లలో నీళ్లు ఎలా పోస్తారో చేసి చూపించాలని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ వీధి నాటకాలు ఆడుతున్నారని, చర్చకు రావడానికి భయమేసే మేడిగడ్డను చూడటానికి రాలేదని దుయ్యబట్టారు.
అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా పూర్తి కాకుండానే ఆరు గ్యారెంటీలపై అబద్ధాలు చెప్పామనడం సరికాదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, లక్షరూపాయల రుణమాఫీ హామీలను బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గాలికి వదిలేసిందని విమర్శించారు. తామిచ్చిన ఆరు గ్యారెంటీలను చేసి చూపిస్తామన్నారు. ప్రజలు రెండేళ్లు అవకాశమిచ్చినా.. విద్యను, వైద్యను గాలికి వదిలేసి, నిరుద్యోగులను మోసం చేసి, రైతులను నిట్టనిలువునా ముంచేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ దే నని ఎమ్మెల్యే రాజగోపాల్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చేసి చూపిస్తామన్నారు. దమ్ముంటే కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మనండి అని అడిగితే.. పారిపోతారని విమర్శించారు.
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.