Farmers Protest Updates: దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్ తో రైతులు నిరసనలు దిగారు. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి మంగళవారం అర్ధరాత్రి తాత్కాలిక విరామం ప్రకటించారు. మంగళవారం ఢిల్లీ సరిహద్దు ప్రాంతానికి రైతులు చేరుకున్నారు. రాత్రంతా రహదారులపైనే ఉన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు తగ్గేదిలేదంటున్నారు.
బుధవారం రాజధానిలోకి ఎంటర్ అవుతామని రైతు నేతలు స్పష్టంచేశారు. ఇప్పటికే ఆందోళనలు చేస్తున్న వారికి మద్దతుగా భారీగా రైతులు వస్తారని వార్తల నేపథ్యంలో పోలీసులు బందోబస్తును మరింత పటిష్టం చేశారు. భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శంభు సరిహద్దు గ్రామాల వైపు హెవీ వెహికల్స్ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. రోడ్డుపై కందకాలు తవ్వి వాహనాలను నిలువరిస్తున్నారు.
మరోవైపు ఢిల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. హస్తినలో ఆంక్షలతో సాధారణ జనం ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
Read More : రాజస్థాన్ రాజ్యసభ బరిలో సోనియా.. నామినేషన్ దాఖలు..
రైతుల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రైతులు కొత్త డిమాండ్లు చేస్తున్నారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. వారి డిమాండ్లపై నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతుందని తెలిపారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించొద్దని రైతులను కోరారు. మరోవైపు రైతు సంఘాల నేతలను చర్చలకు కేంద్రం ఆహ్వానించింది.
వ్యవసాయ శాస్త్రవేత్త, భారతరత్న ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర రైతుల నిరసనలపై రియాక్ట్ అయ్యారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ చలో చేపట్టిన రైతులను అరెస్టు చేసి జైళ్లకు తరలిస్తారని వార్తలు వస్తున్నాయని.. వాళ్లు నేరస్థులు కాదన్నారు. అన్నదాతలతో చర్చలు జరపాలని సూచించారు.
రైతులకు కాంగ్రెస్ మద్దతుగా నిలిచింది. ‘ఢిల్లీ చలో’ కార్యక్రమానికి సపోర్ట్ చేసింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది. రాహుల్ గాంధీ ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులను కలుస్తారని కాంగ్రెస్ ప్రకటించింది.