Workers Trapped In Turkey Gold Mine Landslide: టర్కీలో విరిగిపడిన కొండచరియల్లో 9 మంది గని కార్మికులు చిక్కుకుపోయారు. సైనేడ్తో నిండిన ఆ భారీ మట్టిగుట్ట శిథిలాలు దానికి సమీపంలోని ఓపెన్ పిట్ బంగారపు గనిని, ఆ పక్కనే రహదారిపై ప్రయాణిస్తున్న కార్మికుల వాహనాన్ని కప్పేసినట్టు అధికారులు చెబుతున్నారు.
ఎర్జిన్కన్ ప్రావిన్స్ ఇలిక్ జిల్లాలో ఉన్న ఆ బంగారం గనిలో 667 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ముడిఖనిజం నుంచి బంగారాన్ని వేరు చేసేందుకు మైనింగ్లో సైనేడ్ వినియోగిస్తారు. ఓపెన్ కాస్ట్ గని కావడంతో.. తవ్విన మట్టి అంతా భారీ గుట్టలా పేరుకుపోయింది. ఇప్పుడా విషపూరిత మట్టిగుట్ట విరిగిపడటంతో.. ఆ శిథిలాల కిందే కార్మికులు సమాధి అయి ఉండొచ్చని భావిస్తున్నారు.
Read more: పెరిగిన ప్రపంచ రక్షణ వ్యయం..
సైనేడ్తో నిండిన మట్టి అయినందు వల్ల గాలింపు చర్యలు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. గాలింపు కోసం ప్రత్యేక సామగ్రి అవసరం ఉంటుందని టర్కీ వెల్లడించింది.
కరసు నది ఒడ్డునే ఎర్జిన్కన్ ప్రావిన్స్ ఉంది. టర్కీ నుంచి సిరియా, ఇరాక్కు ప్రవహించే నది యుఫ్రేటీజ్కు ఇది ప్రధాన ఉపనది. 2022లో సైనేడ్ లీక్ కావడంతో.. యుఫ్రేటీజ్ నది కలుషితం కాకుండా ఆ గనిని మూసివేశారు.
అయితే గని యజమాని జరిమానా చెల్లించడంతో ఐదు నెలలకే తిరిగి ఆ ప్లాంట్ ఆరంభమైంది. టర్కీలో దశాబ్ద కాలంగా కొండచరియలు విరిగిపడటం, మైనింగ్ దుర్ఘటనలు చోటు చేసుకోవడం జరుగుతోంది.