Hindu Temple in Abu Dhabi(Today news paper telugu): యూఏఈ రాజధాని అబుదాబి అంగరంగ వైభవంగా అలరారనుంది. భారత ప్రధాని నరేంద్రమోడీ బుధవారం ఇక్కడ తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనుండడమే దీనికి కారణం. యూఏఈలో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఎమిరేట్స్ కు వచ్చిన మోడీ.. నేడు అబుదాబిలో స్వామినారాయణ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హిందూ ఆలయ ప్రారంభోత్సవానికి సర్వహంగులతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ విశిష్ట అతిథిగా ఈ ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ పేరిట ఈ ఆలయాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఇదే అతిపెద్ద హిందూ దేవాలయం.2019లో ప్రారంభమైన ఈ ఆలయ నిర్మాణం నేటికి పూర్తయింది.
సుమారు 27 ఎకరాల స్థలంలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భూమిని యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రభుత్వం 2015లో విరాళంగా ఇచ్చింది. అయితే 2019లో అబుదాబి మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఇది యూఏఈలోని మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి దేవాలయం. జాయెద్ స్పోర్ట్స్ సిటీ అల్ రహ్బా సమీపంలోని అబు మురీఖాలో ఈ ఆలయం ఉంది.
Read More : అనూహ్య నిర్ణయం.. పాకిస్థాన్ కొత్తప్రధానిగా షహబాజ్
దుబాయ్లో మరో మూడు హిందూ దేవాలయాలున్నా, అబుదాబిలో అద్భుత రాతి శిల్పకళతో రూపుదిద్దుకుంటున్న BAPS దేవాలయం గల్ఫ్ ప్రాంతంలోనే అతి పెద్దది. ఈ ఆలయం వెయ్యేండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేందుకు దీనిని పింక్ శాండ్ స్టోన్తో సంప్రదాయ, ఆధునిక వాస్తు కళల మిశ్రమంగా నిర్మించారు. యూఏఈలోని అధిక వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుకరాయిని దిగుమతి చేసుకుని నిర్మాణంలో ఉపయోగించారు.
అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్లు, సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 7 ఎమిరేట్స్ కు ప్రతీకగా.. ఈ ఆలయంలో 7 గోపురాలను ఏర్పాటు చేశారు. ఆలయంలో 402 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభంపై దేవతల శిల్పాలు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు.
Read More : ప్రపంచం భారతదేశాన్ని ‘విశ్వ బంధు’గా చూస్తోంది.. అహ్లాన్ మోదీ కార్యక్రమంలో భారత ప్రధాని..
ఆలయ ఎత్తు 108 అడుగులు కాగా.. నిర్మాణానికి 40 వేల క్యూబిక్ ఫీట్ల పాల రాయి.. 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకలను కూడా వాడారు. ఆలయ ప్రధాన ద్వారం దగ్గర 3D విధానంలో ఏకశిలపై అయోధ్య రామమందిర నమూనాను రూపొందించారు. ఆ అద్భుతాన్ని వీక్షిస్తే సాక్షాత్తూ అయోధ్య రాముడిని దర్శించుకున్న భావన కలగనుంది. ఈ దేవాలయం ఎత్తు 108 అడుగులు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2000 మందికి పైగా శిల్పులు, కార్మికులు మూడేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని నిర్మించారు.
పర్యాటకుల కేంద్రం, ప్రార్థనా మందిరం, ప్రదర్శనలు జరిపే స్థలం, ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేసుకునే స్థలం, పిల్లలు ఆడుకునేందుకు ఆటస్థలంతో పాటు వివిధ థీమ్ పార్క్లు, తాగునీరు, ఫుడ్ కోర్ట్, బుక్స్, గిఫ్ట్స్ వంటి షాపులు కూడా ఆలయ ప్రాంగణంలో నిర్మించారు. దేవాలయ అధిపతి బ్రహ్మవిహారీదాస్ స్వామి ఆధ్వర్యంలో ప్రాణ ప్రతిష్ఠ జరుపుకుంటున్న ఈ అతిపెద్ద హిందూ దేవాలయం 18 నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 15న స్వామి మహారాజ్ సమక్షంలో జరిగే ప్రజా సమర్పణ సభలో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా ఫెస్టివల్ ఆఫ్ హార్మోనీ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.