Pakistan New Prime Minister Shehbaz : పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య నిర్ణయం వెలువడింది. దేశంలోని 265 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు.. ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగి.. 101 స్థానాల్లో గెలిచారు. ఇక.. నవాజ్ షరీఫ్కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ (పీఎంఎల్-ఎన్) 75 స్థానాల్లో, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54 స్థానాల్లో గెలిచింది. మూడింటిలో ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో.. సంకీర్ణ ప్రభుత్వం అనివార్యమైంది.
దీంతో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, మాజీ మంత్రి బిలావల్ భుట్టోలు చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. తొలుత బిలావల్ ప్రధాని పదవిని ఆశించినప్పటికీ.. అంతిమంగా పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ అభ్యర్థి, నవాజ్ షరీఫ్ సోదరుడైన.. షహబాజ్ షరీఫ్(72) ప్రధానిగా ఎంపికయ్యారు. నాలవసారి నవాజ్ షరీఫ్ (74) పాక్ ప్రధాని బాధ్యతలు చేపడుతారని అంతా ఊహిస్తున్న వేళ.. ఈ నిర్ణయం వెలువడింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికారప్రతినిధి మరియం ఔరంగజేబు ఎక్స్ లో వెల్లడించారు.
Read More : ప్రపంచం భారతదేశాన్ని ‘విశ్వ బంధు’గా చూస్తోంది.. అహ్లాన్ మోదీ కార్యక్రమంలో భారత ప్రధాని..
అలాగే నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్ (50)ను పంజాబ్ ప్రావిన్స్ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా.. పీఎంఎల్-ఎన్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మద్దతిచ్చిన రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. ఇకనైనా పాకిస్థాన్ సంక్షోభాల నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిజానికి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పీఎంఎల్-ఎన్, పీపీపీ ముందుకొచ్చినప్పడు.. ప్రధాని పదవిని రెండు పార్టీలూ పంచుకోవాలని భావించాయి. కానీ.. బిలావల్ భుట్టో ప్రధాని రేసు నుంచి వైదొలగడంతో.. నవాజ్ తన తమ్ముడిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ మంగళవారం సమావేశమై కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం పీపీపీ అధినేత బిలావల్ భుట్టో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని తమ పార్టీ సాధించలేకపోయినందున తాను ప్రధాని రేసు నుంచి విరమించుకున్నట్టు ప్రకటించారు.
పీపీపీతో కలిసి సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు పీటీఐ పార్టీ నిరాకరించినందున తాము పీఎంఎల్-ఎన్ వైపు మొగ్గు చూపినట్టు ఆయన స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ సుస్థిరత కోసం తాము నవాజ్ పార్టీకి చెందిన ప్రధాన మంత్రి అభ్యర్థికి మద్దతు పలకాలని నిర్ణయించినట్టు బిలావల్ భుట్టో తెలిపారు. దీంతో పాక్ నూతన ప్రధానికి షహబాజ్ షరీఫ్ మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. ఇమ్రాన్ ఖాన్ మాత్రం.. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు తాము వ్యతిరేకమన్నారు. పీఎంఎల్-ఎన్, పీపీపీ, ఎంక్యూఎం పార్టీలు అతిపెద్ద నగదు అక్రమ చలామణిదారులని విమర్శించారు.