Rivaba Jadeja : గుజరాత్లో రెండు దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉన్న అభ్యర్థులపై దృష్టి పెట్టింది. ఆప్ పార్టీ నుంచి ఎదురవుతున్న గట్టి పోటీని తట్టుకునేందుకు ప్రముఖులకు టికెట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ అభ్యర్థుల తుది జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా పేరు వినిపిస్తోంది.ఆమెకు టికెట్ దక్కుతుందని ప్రచారం సాగుతోంది.
రీవాబా జడేజా మెకానికల్ ఇంజినీర్. ఆమె 2016లో రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు.రాజ్పుత్ వర్గానికి చెందిన కర్ణిసేన నాయకురాలు. మూడేళ్ల క్రితమే రీవాబా బీజేపీలో చేరారు.ప్రముఖ రాజకీయనేత హరి సింగ్ సోలంకికి ఆమె దగ్గరి బంధువు. ఇలాంటి సెలబ్రిటీలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. బలం, బలగం ఉన్న పే అభ్యర్థులను బరిలోకి దించి విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గుజరాత్లో 24 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. మళ్లీ అధికారం నిలబెట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. కొందరు సీనియర్లు,సిట్టింగ్ ఎమ్మెల్యేలు,75 ఏళ్లు దాటినవారిని పక్కనబెట్టేందు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్కు కూడా టికెట్ ఇవ్వరని ప్రచారం సాగుతోంది. అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కొంతమందికి టికెట్లు దక్కుతాయని ప్రచారం సాగుతోంది.
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అధికార బీజేపీ ఢీకొట్టేందుకు ఆప్ విస్తృత ప్రచారం చేస్తోంది. డిసెంబర్ 1,5 తేదీల్లో రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడవుతాయి. ఎన్నికలకు మరో 3 వారాల మాత్రమే సమయం ఉండటంతో పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెట్టాయి.