Flying cars form Maruti Suzuki Electric : అండర్పాస్లు.. ఫ్లై ఓవర్లు.. మెట్రో.. ఎన్ని ఉంటేనేం..? నగరాల్లో ఒకటే రద్దీ. బయటకు వస్తే చాలు.. ట్రాఫిక్ లో ఎన్ని గంటలు చిక్కుకుపోతామో అని ఒకటే ఆందోళన. అలాంటి సమయాల్లో మనకీ రెక్కలుంటే ఎంత బాగుండు..? అని అనిపించడం సహజం. ఆ రోజులు త్వరలోనే రానున్నాయి. ట్రాఫిక్ చిక్కులను తప్పించి.. నేరుగా మిద్దెపైకి మనల్ని చేర్చగలిగే కార్లు వచ్చేస్తున్నాయి. భారత్లో ఆటోమొబైల్ తయారీ దిగ్గజ సంస్థ మారుతి తన మాతృసంస్థ సుజుకీ మోటార్స్తో కలిసి ఎగిరే కార్లను అభివృద్ధి చేయనుంది. పలు దేశాలు ఇప్పటికే ఈ తరహా కార్లను అభివృద్ధి చేస్తున్నాయి. దేశంలోనూ ఆ కల నెరవేరే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి.
మారుతి సుజుకీ తయారు చేసే ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లు డ్రోన్లతో పోలిస్తే పెద్దవే. హెలికాప్టర్ల కన్నా చిన్నవిగా ఉంటాయి. ముగ్గురు సులువుగా ప్రయాణించే వీలుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్కైడ్రైవ్ పేరుతో వ్యవహరిస్తున్న ఈ ఎగిరే కార్లను తొలుత జపాన్, అమెరికా మార్కెట్లలో ప్రవేశపెట్టే యోచనలో సుజుకీ ఉంది. ఆ తర్వాతే మనకు అందుబాటులోకి వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్లను స్థానికంగానే తయారు చేయాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)తో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయి.
మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్ మార్కెట్కు ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్ను సుజుకీ పరిచయం చేయొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు ఉన్నప్పుడే ఈ ఎయిర్ కాప్టర్లకు ప్రజాదరణ లభిస్తుంది. దీని బరువు 1.4 టన్నులు కాగా.. బహుళ అంతస్తుల భవనంపై ల్యాండయ్యే విధంగా డిజైన్ చే్స్తున్నారు. వచ్చే ఏడాది జపాన్ లో జరిగే ఒసాకా ఎక్స్పోలో మారుతి సుజుకీ తన ఎగిరే కార్లను ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఎగిరే కార్లకు ఉన్న డిమాండ్, ప్రాజెక్టు అమలు సాధ్యాసాధ్యాలపై విస్తృత సమాలోచనలను సాగిస్తోంది మారుతి సుజుకీ సంస్థ.