Rehan Ahmed visa row in Rajkot : పాకిస్తాన్ మూలాలున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు వరుసగా భారత్ లో ఇక్కట్ల పాలవుతున్నారు. 5 టెస్ట్ మ్యాచ్ ల సుదీర్ఘ పర్యటనకు ఇండియా వచ్చిన ఇంగ్లాండ్ జట్టులో ఇద్దరు పాక్ మూలాలకు చెందిన స్పిన్ బౌలర్లు బషీర్ అహ్మద్, రెహాన్ అహ్మద్ ఉన్నారు. అయితే మొదట ఇంగ్లాండ్ టీమ్ అబుదాబిలో శిక్షణ పొంది, అప్పుడు ఇండియాకు వచ్చింది. ఈ నేపథ్యంలో మొదటి దశలోనే బషీర్ అహ్మద్ కి చుక్కెదురైంది. వీసా సమస్యలతో తను అబుదాబీ నుంచి డైరక్టుగా ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు.
ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్రధాని కల్పించుకోవడంతో ఉన్నతాధికారులు స్పందించి, క్లియరెన్స్ లు ఇచ్చారు. ఆ సమయంలో రెహాన్ అహ్మద్ ప్రశాంతంగానే వచ్చాడు. అయితే వీరు కుదురుగా ఉండకుండా, మూడో టెస్ట్ కు 10 రోజులు సమయం దొరికేసరికి, మళ్లీ అబుదాబి పరుగెత్తారు. ఇప్పుడు రెహాన్ అహ్మద్ వంతు వచ్చింది.
మూడో టెస్ట్ రాజ్ కోట్ లో జరగనుంది. దానికోసం ఇంగ్లాండ్ క్రికెటర్లు అబుదాబి నుంచి డైరక్టుగా రాజ్ కోట్ వచ్చారు. ఇప్పుడా విమానాశ్రయంలో వీసా సమస్యతో రెహాన్ అహ్మద్ ని ఆపేశారు. హోటల్ కి కూడా వెళ్లనివ్వలేదు. కాకపోతే క్రికెట్ ఉన్నతాధికారులు కల్పించుకోవడంతో 24 గంటలు మాత్రమే ఇండియాలో ఇంగ్లాండ్ ఆటగాళ్లతో కలిసి ఉండేందుకు అవకాశం కల్పించారు.
Read More: టీమిండియాకు షాక్.. మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం..
ఈలోపు విమానాశ్రయం అధికారులు అడిగిన పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే తను తిరుగు టపాలో తిరిగి ఇంగ్లాండ్ వెళ్లాల్సి ఉంటుంది. విషయం ఏమిటంటే రెహాన్ అహ్మద్కు సింగిల్ ఎంట్రీ వీసా ఉండడమే దీనికి కారణం. ఆల్రడీ ఒకసారి ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చేశాడు.
ఇప్పుడు మళ్లీ అబుదాబీ వెళ్లాడు. అంటే రెండో సారి వచ్చి వెళ్లడానికి తనకి అవకాశం లేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా తనకి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దానిని బీసీసీఐ అంగీకరించాలి. అవన్నీ కలిపి విమానాశ్రయ అధికారులకి ఇవ్వాల్సి ఉంటుంది.
దేశ విదేశాల్లో క్రికెట్ ఆడే క్రీడాకారులకి వీసాల్లో వెసులుబాటు ఇవ్వాలని అప్పుడే నెట్టింట డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తమ వీసాలో ఇబ్బందులున్నట్టు తెలిసి కూడా నిర్లక్ష్యంగా పాక్ క్రీడాకారులు తిరుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఇన్ని ఇక్కట్ల పాలవుతున్నారని కొందరు అంటున్నారు.