Medigadda Project: మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ సర్కార్ విజిలెన్స్ విచారణ చేపట్టడంతో అనేక అక్రమాలు బయటపడ్డాయి. కేసీఆర్ సర్కార్ భారీగా అంచనాలను పెంచేసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. మేడిగడ్డ ప్రాజెక్టు మొదట అంచనా రూ. 2 వేల 472 కోట్లు. ఏకంగా 133.67 శాతం అంచనాలు గత ప్రభుత్వం పెంచేసింది. 4 వేల 321 కోట్లు ఖర్చు చేసింది కేసీఆర్ సర్కార్. ఈ విషయాలను ఆధారాలతో సహా విజిలెన్స్ బయటపెట్టింది.
డ్యామ్ కుంగిపోవడానికి గల అనేక కారణాలు, అనుమానాలను తెరపైకి తీసుకొచ్చింది విజిలెన్స్. డ్యామ్ నిర్మాణం పూర్తయ్యాక కాఫర్ డ్యామ్, షీట్ పైల్స్ను తొలగించలేదు. అందువల్లే పియర్స్ కుంగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేసింది. నదీ సహజ ప్రవాహంపై కాఫర్ డ్యామ్ ప్రభావం పడిందని తేల్చింది. డిజైన్లో ఉన్నట్లుగా కటాఫ్ వాల్స్కు, రాఫ్ట్ వాల్స్కు మధ్య నిర్మాణం జరగలేదని విజిలెన్స్ విచారణలో తేలింది.
అసలు నిర్మాణమే పూర్తి కాకపోయినా 2019న సెప్టెంబర్ 10న సర్టిఫికెట్ జారీ చేసింది. పనులు పూర్తికాకుండానే 2021 మార్చి 15న ఏజెన్సీకి పనులు పూర్తైనట్లు సర్టిఫికెట్ ఇచ్చేసింది అప్పటి గులాబీ సర్కార్. ఇంజనీర్ ఇన్ ఛార్జ్ ఇచ్చిన నోటీసును కూడా పట్టించుకోకుండా రూ. 159 కోట్ల సెక్యూరిటీస్ కూడా విడుదల చేసింది.
Read More: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ..
ప్రాజెక్ట్ నిర్మాణ అనుమతుల విషయంలో కూడా భారీగా లోపాలు ఉన్నట్టు తేల్చింది విజిలెన్స్. అసలు అనేక నిర్మాణాలకు ఉన్నతాధికారుల అనుమతే లేనట్టు తేల్చింది. 2019 జూన్ 19న బ్యారేజ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ ఏజెన్సీ గానీ, నీటిపారుదల శాఖ గాని ఎలాంటి తనిఖీలు, పరిశీలనలు చేయలేదని మొత్తం మేడిగడ్డ బ్యారేజ్ నిర్వహణ అస్తవ్యస్థంగా ఉందని తెలిపింది. ప్రతి వర్షాకాలం తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ యాప్రాన్ ప్రాంతాన్ని మెయింటెనెన్స్ చేయాలి. కానీ అలా జరగలేదు. నిబంధనల ప్రకారం బ్యారేజ్ లో నీటి నిల్వల పెంపు, తగ్గుదల స్థాయిలను సరిగా మెయింటైన్ చేయలేదు. అసలు బ్యారేజ్ నిర్మించిన కాంట్రాక్టర్ నిర్మాణ పనుల మొత్తాన్ని పూర్తిచేయనే లేదని తేల్చింది విజిలెన్స్.
మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది విజిలెన్స్ రిపోర్ట్. లీకైన 6, 7, 8 పిల్లర్లను అస్సలు కాంట్రాక్ట్ సంస్థ ఎల్ అండ్ టి నిర్మించలేదు. ఆ పిల్లర్లను సబ్ కాంట్రాక్ట్ సంస్థ నిర్మించింది. ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలను విజిలెన్స్ సేకరించింది. మరో వైపు 3-డీ నమూనాల అధ్యయనాల ప్రకారం బ్యారేజ్ ఎగువ దిగువన వరద ప్రవాహాన్ని తగ్గించే పనులు చేపట్టనట్టు కూడా గుర్తించింది.
ప్రాజెక్టులో ఏవైనా లోపాలున్నా.. నిర్మాణంలో అవకతవకలున్నా.. సరిచేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థదే. కానీ ప్రాజెక్ట్ కుంగిన తర్వాత అలా జరిగే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే 2021లో కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ముందే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2020 నవంబర్ 11 నుంచి మొదలవుతుందంటూ ఇంజినీర్ ఇన్ చీఫ్ లేఖ విడుదల చేశారు.
వాస్తవానికి బ్యారేజ్ పూర్తిగా నిర్మించి.. రెండేళ్లు పూర్తయిన తర్వాత అంతా బాగుంది అనుకుంటేనే ఈ లయబిలిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నిర్మాణం పూర్తికాకుండానే ఈ సర్టిఫికెట్ ఇచ్చేశారు. అంతేకాదు సంస్థ సమర్పించిన బ్యాంక్ గ్యారంటీల తిరిగి చెల్లింపుకు అధికారులు అనుమతినిచ్చేశారు. దీంతో ఇప్పుడీ భారం మొత్తం ప్రజలపై పడనుంది. దీనిపై ఇంజినీర్ ఇన్ చీఫ్ పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సిఫార్స్ చేసింది విజిలెన్స్.
బ్యారేజ్ కుంగుబాటుకు గల కారణాలు కోసం ప్రాజెక్టు డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ పరిశీలించాలని విజిలెన్స్ రిపోర్ట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. వాటితోపాటు జియోలాజిక్ ఇన్వెస్టిగేషన్ తో బ్యారేజ్ లోని అన్ని కాంపోనెన్లు డిజైన్ ప్రకారమే ఉన్నాయా? ఒక దానికొకటి అనుసంధానమై పటిష్టంగా ఉన్నాయా? అన్న విషయాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటిని ఏర్పాటు చేయాలని విజిలెన్స్ నివేదిక ప్రభుత్వనికి సిఫార్స్ చేసింది.
అసలు 137 శాతం అంచనాలు ఎందుకు పెరిగాయి? పెరిగిన అంచనాల ప్రకారం ఖర్చు చేసిన నిధులు నిజంగానే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉపయోగించారా? లేక గులాబీ నేతల జేబుల్లోకి వెళ్లాయా? ఎల్ అండ్ టీ లాంటి సంస్థ కాకుండా ముఖ్య నిర్మాణాలు సబ్ కాంట్రాక్టర్లకు ఎందుకు ఇచ్చింది? దీని వెనకున్న లోసుగులేంటి? అన్న దానిపై విజిలెన్స్ మరింత ఫోకస్ పెట్టింది.