TS Assembly Session 2024: మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో లోపాలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగా.. మంత్రి భట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ మొదలుపెట్టారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ లోపాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు మేడిగడ్డ వాస్తవాలను కళ్లారా చూసేందుకు బీఆర్ఎస్ సభ్యులు కూడా రావాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుతగిలారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డపై అధికారులు ఇచ్చిన నివేదికను చర్చించాలంటే ముందు వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. మేడిగడ్డ నిర్మాణ లోపం వల్ల కుంగిందా, ఇసుకలో పేకమేడ కడితే కుంగిందా ? బాంబులు వేయడంతో కుంగిందా అన్నది చూసి తెలుసుకోవచ్చన్నారు. కేసీఆర్ సృష్టించిన అద్భుతం గురించి.. ఆయనే సభ్యులకు వివరిస్తే బాగుంటుందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ను కళ్లారా చూశాకే.. నివేదికపై చర్చిస్తామన్నారు. కేసీఆర్ కూడా మేడిగడ్డకు రావాలని.. ఆయన కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. హరీష్ రావు కూడా మేడిగడ్డకు రావాలని కోరుతున్నామన్నారు.
Read More: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇంట విషాదం.. అనారోగ్యంతో సోదరుడి మృతి
రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మేడిగడ్డలో అసలేం జరిగిందో ప్రజలకు నిజాలు తెలియాలన్నారు. డ్యామ్ డిజైన్ లో చాలా తప్పులున్నాయి. కాంగ్రెస్ హయాంలో కట్టిన పలు ప్రాజెక్టులు ఇప్పటికీ దృఢంగా ఉన్నాయని, ఇటీవల కట్టిన ప్రాజెక్టులు ఎందుకు కుంగిపోతున్నాయని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని, అలాంటి ప్రాజెక్టులను సరిగ్గా నిర్మించనిపక్షంలో నష్టపోయేది మనమేనన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఖజానా డబ్బు చాలా వృథా అయిందని, ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులను నిర్మించి.. అభివృద్ధి చేశామని ప్రజల్ని మోసం చేశారని సీఎం రేవంత్ విమర్శించారు.