Rs 5.48 TTD Hundi income in a Single day: ఆంధ్రప్రదేశ్ లో పుణ్యక్షేత్రాల గురించి చెప్పాలంటే మొదటగా గుర్తొచ్చేది తిరుమల తిరుపతి. ఏడుకొండలపై వేంచేసియున్న ఆ వేంకటేశ్వరుడిని ప్రతినిత్యం వేలమంది భక్తులు దర్శించుకుని తరిస్తారు. ప్రతిరోజూ స్వామివారికి హుండీ ఆదాయం ఒక కోటి నుంచి 3 కోట్ల రూపాయల వరకూ వస్తుంది. కానీ.. సోమవారం ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం రూ.5.48 కోట్లు వచ్చినట్లు టిటిడి వెల్లడించింది. శ్రీవారి హుండీ ఆదాయం ఇంతపెద్ద మొత్తంలో రావడం రికార్డని చెబుతున్నారు. సోమవారం ఒక్కరోజే స్వామివారిని 69,314 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 25,165 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కుల్ని చెల్లించుకున్నారు.
మంగళవారం స్వామివారి దర్శనార్థం 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. టైమ్ స్లాట్ టికెట్ లేని సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతుంది. కాగా.. ఈ నెల 16వ తేదీన రథసప్తమిని పురస్కరించుకుని తిరుమల శ్రీకోదండ రామస్వామివారి ఆలయంలో వైభవంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
Read More: ప్రేమికుల ఆలయం.. పారిపోయి వస్తేనే ఎంట్రీ!
మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ తిరుపతి శేషాచల పర్వతమూలంలో వెలసియున్న శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 29న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మార్చి 1న ధ్వజారోహణం, రాత్రి హంసవాహన సేవ ఉంటుంది. మార్చి 2- ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, మార్చి 3 – ఉదయం భూత వాహనం, రాత్రి సింహవాహనం, మార్చి 4 ఉదయం – మకరవాహనం, రాత్రి శేషవాహనం, మార్చి 5- తిరుచ్చి ఉత్సవం, రాత్రి – అధికారనంది వాహనం, మార్చి 6 ఉదయం – వ్యాఘ్ర వాహనం, రాత్రి గజవాహనం, మార్చి 7 – ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి అశ్వవాహనం, మార్చి 8 ఉదయం రథోత్సవం, రాత్రి నందివాహనం, మార్చి 9న ఉదయం పురుషామృగవాహనం, సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. మార్చి 10 ఉదయం త్రిశూలస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం, రాత్రి రావణాసుర వాహనం ఉంటుంది.