Medico Suicide on Hyderabad Outer Ring Road: కుటుంబాల్లో మనస్పర్ధలతో కొందరు, అనారోగ్యం, పేదరికం, అప్పులబాధతో మరికొందరు, నిరుద్యోగం, పరీక్షల్లో ఫెయిల్.. ప్రేమలో విఫలం. ఇష్టంలేని పెళ్లితో ఇంకొందరు.. వరకట్న వేధింపులు,.అవమానం, డిప్రెషన్ ఇలా కారణాలు ఏదైతేనేం. క్షణికావేశంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. తాజాగా పీజీ వైద్య విద్యార్థిని లక్ష్మీరచనారెడ్డి(25) ఔటర్ రింగ్రోడ్డుపై కారులో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ప్రాణాంతక ఇంజక్షన్ తీసుకోవడం వల్లే ఆమె మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం BHEL HIG కాలనీలో నివాసముండే 26ఏళ్ల డాక్టర్ లక్ష్మీరచనారెడ్డి అనే మహిళ.. బాచుపల్లి మమత వైద్య కళాశాలలో పీజీ గైనకాలజీ ఇంటర్న్షిప్ చేస్తోంది. ఆమె తండ్రి మోతె ప్రకాష్రెడ్డి వ్యాపారి. రోజూ ఆమె కాలేజీకి కారులో వెళ్లి వచ్చేది. సోమవారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన రచనా ఔటర్ రింగ్రోడ్డుపై కారు పక్కకి నిలిపి.. డ్రైవింగ్ సీట్లోనే ఇంజక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కిష్టారెడ్డిపేట గ్రామ శివారులోని ఔటర్రింగ్ రోడ్డుపై కారులో ఓ యువతి అపస్మారక స్థితిలో ఉందని అమీన్పూర్ పోలీసులకు సమాచారం అందింది.
Read More: బదిలీల పర్వం.. రాచకొండ సీపీగా తరుణ్ జోషి..
దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న లక్ష్మీరచనారెడ్డిని ఆమె చదువుకుంటున్న మమత ఆస్పత్రికే తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందింది. ప్రాణాంతక ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించి.. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
లక్ష్మీ రచనారెడ్డి ఆత్మహత్య ఘటన.. మమతా ఆస్పత్రిలో, తోటి విద్యార్థుల్లో విషాదాన్ని నింపింది. ఆమె తల్లిదండ్రులు మాత్రం.. తమ కూతురికి ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. చదువంటే చాలా ఇష్టమని, డాక్టర్ అవ్వాలన్నది తన గోల్ అని, డాక్టర్ కావడమే జీవిత ఆశయంగా పెట్టుకుందని పేర్కొన్నారు. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుందా ? లేక తనను ఎవరైనా వేధిస్తున్నారా అన్న కోణాల్లోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. రచనారెడ్డి అపస్మారక స్థితిలో ఉన్నపుడు కారులో డ్రైవర్ సీటులో సీటుబెల్ట్ పెట్టుకుని ఉందని, చేతికి కాన్యులా ఉండటంతో పాయిజన్ తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు.