Sonia Gnadhi and Priyanka Gnadhi in Rajya Sabha Elections 2024: రాబోయే రాజ్యసభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల పేర్లపై చర్చించేందుకు కాంగ్రెస్ నేతలు సోమవారం పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, కోశాధికారి అజయ్ మాకెన్లు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పదవీకాలం ఈ ఏప్రిల్తో ముగియడంతో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఖాళీ అయ్యే స్థానానికి సోనియా గాంధీయే ముందున్నారు. కాగా అటు రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ రాజ్యసభ బరిలో ఉంటారని సమాచారం. దీంతో ఏ రాష్ట్రం నుంచి నామినేషన్ దాఖలు చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. అటు ప్రియాంక గాంధీ లోక్ సభ ఎన్నికల్లో రాయ్ బరేలీ బరిలో దిగనున్నట్లు సమాచారం
15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.
సోనియా గాంధీ ఈసారి లోక్సభకు పోటీ చేసే అవకాశం లేకపోవడంతో హిమాచల్ నుంచి పార్టీ ఆమెను నామినేట్ చేసే అవకాశం ఉంది. తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే చివరి సారి అని సోనియా గాంధీ 2019 లోక్సభ ఎన్నికల్లో చెప్పారు.
Read More: నేను రాజకీయాల్లో లేను.. వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఖర్గే నివాసానికి హాజరైన వారిలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ఉన్నారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ కూడా పాల్గొన్నారు.
కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలకు ఎన్నికయ్యే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది.
కాగా సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం నుంచి పోటీ చేయాలని గతంలో ఆమెను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. కానీ ఇప్పుడు సోనియా రాజ్య సభ బరిలో ఉంటారని సమాచారం రావడంతో ఖమ్మం సీటుకు లాబీయింగ్ స్టార్ట్ అయ్యింది.