Atmakuru TDP updates(AP political news): యువగళం పాదయాత్రలో ఒక నేత చేసిన హడావుడితో ఆ నియోజకవర్గం టీడీపీలో జోష్ కనిపించింది. అయితే ఆయన తర్వాత కొంత కాలంగా సైలెంట్ కావడంతో అక్కడి పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమ నియోజకవర్గం పరిస్థితి ఏంటా అని నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వైసీపీ స్థానిక ఎమ్మెల్యే ఏదో ఒక కార్యక్రమంతో హడావుడి చేస్తుండటంతో.. తమని నడిపించే నాయకుడి కోసం ఎదురు చూడాల్సి వస్తోంది వారికి.. పదేళ్లుగా పాతుకుపోయిన వైసీపీని ఢీకొనే సత్తా ఉన్న నాయకుడు ఎవరొస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు అక్కడి తెలుగు తమ్ముళ్లు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదంటారా?
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అయోమయం నెలకొంది. ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక. తెలుగుదేశం పార్టీ శ్రేణులు దిక్కులు చూస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత అక్కడ టీడీపీ శ్రేణులు ఢీలా పడిపోయాయి. కొద్దికాలం క్రితం నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్ర వారిలో జోష్ నింపినట్లు కనిపించింది.
అప్పటివరకు ఎవరిని అభ్యర్ధిగా ప్రతిపాదిస్తారో తెలియక అయోమయంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీకి దగ్గర కావడం. యువగళం పాదయాత్రలో అంతా తానై వ్యవహరించడంతో సంబరపడిపోయారు. ఆనం రామనారాయణరెడ్డి ఈ సారి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారని.. గెలుపు తమదే అన్న ధీమా వారిలో కనిపించింది.
2019లో వైసీపీ నుంచి గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి గా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆకస్మిక మరణం చెందారు. ఉపఎన్నికలో గౌతమ్ రెడ్డి తమ్ముడు మేకపాటి విక్రమ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి చేసిందేమి లేదన్న టాక్ ఉంది. అయితే ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ.. కార్యకర్తలతో మమేకం అవుతూ.. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.
అలాంటి విక్రమ్రెడ్డిని సమర్ధంగా ఎదుర్కోవాలంటే.. ఆత్మకూరు టీడీపీకి బలమైన నాయకుడు అవసరమన్న చర్చ జరుగుతూ వచ్చింది. స్థానిక టీడీపీ నేతల్లో ఐక్యత లేకపోవడం.. పార్టీలో అంతో ఇంతో బలమున్న నాయకులు వైసీపీలో చేరడంతో ఆ పార్టీకి మైలేజ్ పెరిగిపోయిందని, వైసిపి మైలేజ్ తగ్గించాలంటే.. అనుభవం ఉన్న బలమైన నాయకుడు వస్తే తప్ప టీడీపీకి గెలుపు అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమయ్యేది.
2019లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొల్లినేని కృష్ణయ్య తర్వాత తెరమరుగైపోయారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నిరుత్సాహంనెలకొంది. అలాంటి తరుణంలో ఆనం రామనారాయణరెడ్డి నియోజకవర్గంలో లోకేష్ యాత్ర బాధ్యతలు తీసుకొని నడిపించడం ఆత్మకూరు టీడీపీలో నూతన ఉత్సాహాన్ని నింపింది. అయితే యువగళం పాదయాత్ర తర్వాత ఏమి జరిగిందో ఏమోగానీ ఆనం రామనారాయణ రెడ్డి సైలెంట్ కావడం. నియోజకవర్గం లో కనిపించకపోవడంతో అక్కడి పసుపు సైన్యం మళ్లీ ఢీలా పడిపోయింది.
ఆత్మకూరు నియోజకవర్గం లో టీడీపీకి మంచి క్యాడర్ ఉన్నా లీడర్లు కరువు అయినప్పుడు.. ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని టీడీపీ పెద్దలు ప్రతిపాదించినా ఆయన ఒప్పుకోలేదంట.. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి టికెట్టే కావాలని పట్టుబడుతున్నారంట. 2009లో ఆత్మకూరు నియోజకవర్గంగా ఏర్పడినప్పుడు అక్కడ నుంచి గెలిచిన ఆనం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. తర్వాత వైసీపీ ఆదేశాలతో వెంకటగిరి వెళ్లి గెలిచారు. అలాంటాయనకు ఇప్పుడు ఆత్మకూరులో పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నా.. అక్కడకు రావడానికి అభ్యంతరం ఏంటో అంతుపట్టడం లేదంటున్నారు. మేకపాటి కుటుంబంతో ఇంటర్నల్ రిలేషన్స్ ఏమన్నా ఉన్నాయేమో అన్న టాక్ వినిపిస్తోంది. ఏదైతేనేం.. ఎలక్షన్స్ నాటికి చంద్రబాబు ఆత్మకూరు లెక్కలు ఎలా సరిచేస్తారో? చూడాలి.