Minister Roja counter to Ys Sharmila: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ నడుస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన అన్న ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారామె. ఈ నేపథ్యంలో నగరికెళ్లి మంత్రి రోజాపై ఘాటు విమర్శలు గుప్పించారు.
నగరి నియోజకవర్గంలో నలుగురు మంత్రులతో పాటు ఒక ఎమ్మెల్యే ఉన్నారూ.. ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని షర్మిల విమర్శలు చేశారు. గ్రావెల్, చెరువులో మట్టితో పాటు వెంచర్లు వేసే రియల్టర్ల నుంచి ముడుపులు తీసుకుంటూ నియోజకవర్గం అంతా దోచుకున్నారని విమర్శించారు. అక్కడితో ఆగకుండా రోజాతో పాటు ఆమె భర్త, ఆమె ఇద్దరి సోదరులు కూడా మంత్రులుగా చెలామణి అవుతూ ప్రజల నుంచి కమీషన్లు పిండుకుంటున్నారని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ” అమ్మా రోజమ్మ నువ్వు నా గతం గురించి గుర్తు పెట్టుకొని నీ గతాన్ని మర్చిపోయినట్టున్నావు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
షర్మిల వ్యాఖ్యలపై మంత్రి రోజా సోమవారం మీడియా సమక్షంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపనల్లో ఒక్కదాన్నైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని షర్మిలకు రోజా కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ బిడ్డ అని .. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదని షర్మిలకు కౌంటర్ ఇచ్చారు.
తన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణల్లో షర్మిల ఒక్కదాన్నైనా నిరూపిస్తే రాజకీయాల నుంచి దూరమవుతానని రోజా సవాల్ విసిరారారు. తన సొంత కష్టంతో ఎవరి మద్దతు లేకుండా సినిమాల్లోనూ, రాజకీయాల్లో ఎదిగానని ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
Read More: రాజ్యసభ ఎన్నికలు.. వైసీపీకి ఇది చాలా టఫ్ గురూ.. బడా వ్యూహమేంటి..?
నగరి తన వూరు కాకపోయినా.. సినిమాలు, టీవీ షోలు వదులుకుని, సేవ చేయాలనే తలంపుతో ఇక్కడికి వచ్చానని రోజా అన్నారు. ఆడబిడ్డ అయిన తనకు అన్నలతో పాటు భర్త అండగా నిలబడడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ రోజు వరకూ తన వాళ్లు ఒక్క పదవి కూడా తీసుకోలేదన్నారు. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి ఎవరినీ బెదిరించలేదన్నారు. ఎక్కడా డబ్బు తీసుకోలేదన్నారు.
ఇన్ని రోజులు వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ అనే కారణంతోనే షర్మిలను అందరూ గౌరవించారని రోజా అన్నారు. వైఎస్సార్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల కాంగ్రెస్లో చేరడాన్ని వైఎస్సార్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారన్నారు. జగన్ను 16 నెలల పాటు కాంగ్రెస్ సర్కార్ జైల్లో పెట్టడాన్ని వైఎస్సార్ అభిమానులెవరూ మరిచిపోలేదని పేర్కొన్నారు. అలాంటి కాంగ్రెస్ నుంచి షర్మిలనే కాదు, ఎవరు మాట్లాడినా విలువ వుండన్నారు.
కాంగ్రెస్ గొప్పదంటూనే, మళ్లీ వైఎస్సార్ బిడ్డనంటూ షర్మిల చెప్పుకుంటున్నారని షర్మిల విమర్శించారు. వైఎస్సార్ బిడ్డ అంటేనే జగన్మోహన్ రెడ్డి అన్నారు. తన తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకే వైసీపీని స్థాపించారన్నారు. వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచేలా షర్మిల తీరు ఉందని రోజా విరుచుకుపడ్డారు. ఏ లబ్ధి కోసం చంద్రబాబు, పవన్కల్యాణ్ ఇళ్లకు షర్మిల వెళ్లారని ఆమె నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో దూరి నీతులు చెబుతుంటే సామెతలు గుర్తుకొస్తున్నాయని షర్మిలను రోజా దెప్పి పొడిచారు.