India vs England : T20 వరల్డ్ కప్ లో సెకండ్ సెమీస్ మ్యాచ్… ఇండియా, ఇంగ్లండ్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే… రెండు జట్లు భీకరమైన ఫామ్ లో ఉన్నాయి. సమఉజ్జీల మధ్య జరిగే పోరు ఎలా సాగుతుందో? ఎవరు గెలుస్తారో? చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే భారత అభిమానులు మాత్రం… టీమిండియాదే విజయమని ధీమాగా ఉన్నారు. పాత రికార్డుల్నే దీనికి సాక్ష్యంగా చూపుతున్నారు.
T20 ఫార్మాట్లో ఇండియా-ఇంగ్లండ్ 22 సార్లు తలపడగా.. భారత్ 12 సార్లు, ఇంగ్లండ్ 10 విజయాలు దక్కించుకున్నాయి. ఇక T20 ప్రపంచకప్లో రెండు జట్లు 3 సార్లు తలపడగా… టీమిండియా 2 సార్లు, ఇంగ్లండ్ ఓసారి గెలిచాయి. ఈ గణాంకాలు పరిశీలిస్తే ఇంగ్లండ్ పై టీమిండియాదే పైచేయి అని… మ్యాచ్ జరిగే అడిలైడ్లో ఇంగ్లండ్ టీమ్ కు చెత్త రికార్డు ఉండటం కూడా… రోహిత్ సేనకు కలిసొస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అడిలైడ్ లో ఇంగ్లండ్ 17 వన్డేలు ఆడగా.. కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఇదే మైదానంలో ఆడిన ఒకే ఒక T20 మ్యాచ్ లో… ఆస్ట్రేలియాపై అతికష్టమ్మీద గెలిచింది… ఇంగ్లండ్. అంతేకాదు… ఈ వరల్డ్ కప్ లో టీమిండియాకు అడిలైడ్ లో ఆడిన అనుభవం ఉంది. ఆ మ్యాచ్ లో బంగ్లాపై రోహిత్ సేన అద్భుత విజయం సాధించింది. కానీ… ఈ వరల్డ్ కప్ లో అడిలైడ్ లో ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దాంతో… పరిణామాలన్నీ టీమిండియాకే అనుకూలంగా ఉన్నాయని, రోహిత్ సేనదే గెలుపని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇంగ్లండ్ తో మ్యాచ్ లో రోహిత్ సహా విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, పాండ్యా చెలరేగి ఆడితే… భారీ స్కోరు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బౌలింగ్ లో అర్షదీప్ సింగ్, మహ్మద్ షమీ, పాండ్యా, భువీతో పాటు అశ్విన్ కూడా అదరగొడుతున్నారని… అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు రెచ్చిపోతే… ఇంగ్లండ్ పై ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసి ఫైనల్ చేరడం ఖాయమంటున్నారు.