Governor of Tamil Nadu RN Ravi : తమిళనాడు సర్కార్ కు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి షాక్ ఇచ్చారు. స్టాలిన్ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
మొదటి రోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ ఆర్.ఎన్ రవి అసెంబ్లీకి వచ్చారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన కొద్ది నిమిషాలకే తన ప్రసంగాన్ని ముగించారు.ఆయన ప్రసంగం ప్రారంభంలో సీఎం స్టాలిన్, స్పీకర్, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం తాను ప్రసంగం చదవడం లేదని చెప్పి ముగించారు. ప్రసంగంలోని అంశాలు సరిగా లేవన్నారు.
ప్రసంగం ప్రారంభించే ముందు, పూర్తయిన తర్వాత జాతీయ గీతం ఆలపించాలని తాను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని గవర్నర్ ఆర్.ఎన్ రవి అన్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అందుకే తాను ప్రసంగం చదవ లేదని గవర్నర్ తేల్చి చెప్పారు.
Read More: బీహార్ ప్రభుత్వ భవితవ్యం తేలేది నేడే.. అసెంబ్లీలో బలపరీక్ష
ప్రసంగంలోని చాలా అంశాలపై తనకు అభ్యంతరాలున్నాయని గవర్నర్ ఆర్.ఎన్ రవి తేల్చి చెప్పారు. అసలు నిజాలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ప్రసంగంలోని అంశాలు ప్రతిబింబించడం లేదన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. అక్కడి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా ప్రసంగంలోని కేవలం లాస్ట్ పేరా చదవి గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు.