TS Assembly Sessions 2024: నాల్గవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో హుక్కా పై నిషేధం విధిస్తూ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. అనంతరం.. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేఆర్ఎంబీ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాలు తెలంగాణకు ప్రధాన ఆధారమని.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు విఫలమైందని ధ్వజమెత్తారు.
కృష్ణాజలాలపై గత ప్రభుత్వం సరైన వాదనలను వినిపించలేదన్నారు. ఏపీ ప్రభుత్వం అదనపు నీటిని తరలిస్తున్నా మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు. ఇన్ ఫ్లో తగ్గి.. డైవర్షన్ పెరిగిందన్నారు. పాలమూరు- రంగారెడ్డికి రూ.27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో 1200 టీఎంసీలు డైవర్ట్ అయినట్లు పేర్కొన్నారు. 811 టీఎంసీలలో కేవలం 299 టీఎంసీలనే క్లెయిమ్ చేశారని.. అలాంటి బీఆర్ఎస్ 50 శాతం కావాలని మాట్లాడటం వింతగా ఉందన్నారు. చేసిందంతా చేసి.. నల్లగొండలో సభ పెడితే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు.
Read More : గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలకు లైన్ క్లియర్
నీటి పంపకాల విషయంలో గత ప్రభుత్వం ఎలాంటి అబ్జెక్షన్ చెప్పకుండా మిన్నకుండిపోయిందన్నారు. ఏపీ సీఎం జగన్ కు.. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కృష్ణా జలాలను ధారపోశారని ఘాటు విమర్శలు చేశారు. ఇకపై సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కృష్ణాజలాలను తరలించే ప్రసక్తే లేదన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికీ అప్పజెప్పే ప్రసక్తే లేదన్నారు. కృష్ణాజలాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. నదీజలాల పంపకాల్లో అన్యాయం జరిగిందనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడితే.. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయమే జరుగుతుందని మంత్రి ఉత్తమ్ వాపోయారు. బీఆర్ఎస్ వచ్చాక కృష్ణాజలాల్లో మరింత అన్యాయం జరిగిందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో.. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీకి వెళ్లి 299 టీఎంసీలు పంపకానికి ఒప్పుకుని.. నీటి వాటాలో తెలంగాణకు శాశ్వత నష్టం చేశారని దుయ్యబట్టారు. కృష్ణాజలాలపై ఏపీ సీఎం జగన్, కేసీఆర్ ఏకాంత చర్చలు జరిపారని.. ఈ విషయాన్ని స్వయంగా జగనే అసెంబ్లీలో చెప్పారన్నారు. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీల నీరు ఏపీకి వెళ్తుందని, దీనిపై ఎప్పుడైనా కేసీఆర్ నోరువిప్పి మాట్లాడారా ? అని ప్రశ్నించారు. నాడు బీఆర్ఎస్ చేసిన ఘనకార్యంతో.. నేడు నాగార్జునసాగర్ డ్యాం ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.