Indian Players Speaking in Telugu in U19 World Cup 2024 : అండర్ 19 వరల్డ్ కప్లో ఇద్దరు ఆటగాళ్లు మన తెలుగు వారనే సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఒకరు మురుగన్ అభిషేక్, మరొకరు అరవెల్లి అవనీశ్ రావు. అయితే వీరిద్దరూ ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తెలుగులో మాట్లాడుకున్నారు. ఈ మాటలు స్టంప్ మైక్లో రికార్డయ్యాయి.
అవి అలా రికార్డ్ అవుతాయనే చాలామంది సైగలు చేస్తూ ఉంటారు. కాకపోతే అక్కడెవరికీ తెలుగు రాదు కాబట్టి, అర్థంకాదనే ఉద్దేశంతో వికెట్ కీపర్ అయిన అవనీశ్ రావు కాస్త గట్టిగానే మాట్లాడినట్టున్నాడు. ఇంతకీ తనేమన్నాడంటే..
‘సేమ్ బాల్ వేయ్రా.. మంచి బాల్ పడింది. కొడితే స్వీప్ కొట్టాలి. అంతకు మించేం కాదు. మహా అయితే రెండే షాట్స్ కొట్టి అయిపోతాడు’ అని అన్నాడు. ఈ మాటలను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
చాలామంది తెలుగువాళ్లు నెట్టింట తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇలాంటి మధురమైన క్షణాలు వస్తాయని తెలీదు. క్రికెట్ గ్రౌండులో ఇద్దరు కుర్రాళ్లు ఇలా తెలుగు మాట్లాడుకోవడం వినడానికెంతో బాగుందని కామెంట్ చేస్తున్నారు.
Read More: U19 World Cup Final: ఓడిన కుర్రాళ్లు.. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం..
నిజానికి ప్రతీ క్రికెట్ టీమ్లో ఉత్తర భారతీయులే హల్చల్ చేస్తుంటారు. వారు నిత్యం హిందీ మాట్లాడుకుంటూ తమ ఆనందాలు, సంతోషాలు, బాధలు, ఉద్వేగాలని వ్యక్తపరుస్తూ ఉంటారు. అసలు తెలుగు మాట్లాడుకోవడం అనేది ఊహకు కూడా అందని విషయంగా చెప్పాలి.
నిజానికి ఆంధ్రా ప్లేయర్లే అరుదుగా 11మంది జట్టులో ఉంటారు. వారిని వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అందరికీ గుర్తున్నవారిలో సమకాలీన క్రికెట్లో వెంకటపతి రాజు, వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు తదితరులున్నారు. మహ్మద్ అజారుద్దీన్ ఉన్నాడు కానీ, తనకిప్పటికి తెలుగు సరిగా రాదు. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో వికెట్ కీపర్ కేఎస్ భరత్ కూడా తెలుగువాడే.
కాకపోతే ఇప్పుడు అండర్ 19లో ఆడే అవనీశ్ రావుది తెలంగాణలోని సిరిసిల్ల అయితే, మురుగన్ అభిషేక్ది హైదరాబాద్. వీరిద్దరూ చక్కగా తెలుగు మాట్లాడి, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆనందాలని అందించారు.