Qatar Frees 8 Indian Navy Officers: భారత్ దౌత్యంలో మరో సంచలన విజయం. ఖతార్లో గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ ఉరిశిక్ష పడిన ఇండియన్ నేవీ మాజీ అధికారుల కోసం భారత ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. వారి మరణశిక్షను రద్దు చేయడమే కాకుండా.. వారిని విడుదల చేయడం.. వారంతా భారత్కు రావడం కూడా జరిగిపోయింది. ఈ రోజు తెల్లవారుజామున ఏడుగురు అధికారులు భారత్ చేరుకున్నారు.
అంతకుముందు వీరికి విధించిన మరణశిక్షపై రివ్యూ చేయాలని కోరుతూ భారత్ చేసిన అప్పీల్ పిటిషన్ను ఖతార్ కోర్టు అంగీకరించింది. విచారణ జరిపి మరణశిక్షను సాధారణ జైలు శిక్షగా మార్చింది. కానీ విదేశాంగశాఖ వారిని విడుదల చేసేందుకు ప్రయత్నించడంతో ఖతార్ అమీర్, అక్కడి కోర్టులు సానుకూలంగా స్పందించి వారిని విడుదల చేశాయి.
కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేష్లను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టులో అరెస్టు చేసింది. వీరంతా ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేస్తూ దొరికిపోయారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా.. ఆరోపణలు నిజమని తేలడంతో ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది.
దీంతో బాధిత కుటుంబాలు తమవారిని విడుదల చేయించి సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. దాంతో.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించి.. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు అవసరమయ్యే చట్టపరమైన సహాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది.
ఖతార్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఖతార్లో నిర్బంధించిన దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న ఎనిమిది మంది భారతీయ పౌరులను విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తుందని ప్రకటన చేసింది.