CM Revanth Reddy On Krishna Basin Projects: కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(KRMB)కు ప్రాజెక్టులను అప్పగించిన వ్వవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వారి నాయకులను అసెంబ్లీలో నిలదీయాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సూచించినట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రజా భవన్లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పుల గురించి సభ్యులకు వివరించినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు సమాచారం. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం KRMBకి అప్పగించినట్లు కారు పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని వాటిని అసెంబ్లీ సమావేశాల్లో తిప్పికొట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.
Read More: హస్తం గూటికి మాజీ మేయర్..? సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ..
ఇక ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. KRMB సమావేశంలో ప్రాజెక్టులను అప్పగించినట్లు బీఆర్ఎస్ నేతలు అబద్దాలు చెబుతున్నారని తెలిపారు. అలా ప్రాజెక్టులను అప్పగించినట్లు ఇరిగేషన్ శాఖ సెక్రటరీ కానీ, ఇంజనీర్ ఇన్ చీఫ్ కానీ సంతకాలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గురించి చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. రాయలసీమకు నీటిని తీసుకోవడానికి అప్పటి సీఎం కేసీఆర్ అంగీకరించారని జగన్ అసెంబ్లీలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.
సమావేశం తర్వాత ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. అసెంబ్లీలో అన్ని వాస్తవాలను బయటపెడ్తామని స్పష్టం చేశారు. తాము అడిగే ఒక్కో ప్రశ్నకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని సూచించారు. కేసీఆర్ నల్లగొండ సభలోపే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తామని తెలిపారు.