EX Mayor Bonthu Rammohan Met CM Revanth Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి రోజుకో షాక్ తగులుతోంది. ఒక్కొక్కరుగా కారు దిగి చేతికి దగ్గరవుతున్నారు. మాజీ మంత్రి పట్నం నరేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన విషయం మరువకముందే కారు పార్టీకి ఇంకో షాక్ తగిలింది. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్ నగరానికి బొంతు రామ్మోహన్ తొలి మేయర్గా పనిచేశారు. బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సన్నిహితుడని పేరు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మేయర్ ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. బొంతు రామ్మోహన్కు కాకుండా బీఆర్ఎస్ ఉప్పల్ అసెంబ్లీ టికెట్ను బండారి లక్ష్మారెడ్డికి కేటాయించింది. లక్ష్మారెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డిపై 49 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.
బొంతు రామ్మోహన్ భార్య బొంతు శ్రీదేవి ప్రస్తుతం చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్గా ఉన్నారు. రామ్మోహన్ త్వరలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఫిబ్రవరి 8న ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షి సమక్షంలో అధికార పార్టీలో చేరారు.
Read More: బీఆర్ఎస్ స్కామ్లపై సీఎం ఫోకస్.. త్వరలో వాటిపై విచారణ..
గత లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ప్రస్తుత సీఎం కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఈ సీటులో మళ్లీ కాంగ్రెస్ విజయం సాధించాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది.
అంతకుముందు జీహెచ్ఎంసీ మేయర్ జి. విజయలక్ష్మి రేవంత్రెడ్డితో సమావేశమై జీహెచ్ఎంసీ నిధుల విడుదలపై చర్చించినట్లు సమాచారం. పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం అందడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారితో సమావేశమయ్యారు.