Full Competition in AP Congress | రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్లో అలికిడే కనిపించలేదు. ఉన్న నేతలు కూడా ఎన్నికలు, టికెట్లు అంటే ఆమడ దూరం పారిపోయేవారు. పదేళ్లు తిరిగే సరికి పరిస్థితి మారిపోయింది. వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి హడావుడి మొదలైంది.
Full Competition in AP Congress: రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్లో అలికిడే కనిపించలేదు. ఉన్న నేతలు కూడా ఎన్నికలు, టికెట్లు అంటే ఆమడ దూరం పారిపోయేవారు. పదేళ్లు తిరిగే సరికి పరిస్థితి మారిపోయింది. వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి హడావుడి మొదలైంది. తాజాగా ఏఐసీసీ ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ టికెట్ ఆశావహుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175, అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు వందల్లో అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయి. ఒక్కో అసెంబ్లీ, ఎంపీ స్థానం నుంచి పదుల సంఖ్యలో అప్లికేషన్లు బెజవాడలోని ఆంధ్రరత్న భవన్కు చేరుతున్నాయి. ఆ కోలాహలంతో దరఖాస్తుల స్క్రూటినీ కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా తయారైందంట.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి .. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఇంతకాలం రాష్ట్రంలో నిశ్శబ్దంగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటే .. తాము పోటీ చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. కార్యకర్తల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ల వరకు రాబోయే ఎన్నికల్లో ఆయా సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తామని అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు.
హైకమాండ్ ఆదేశాల మేరకు మాణికం ఠాగూర్ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు గేట్లు తెరిచారు. దాంతో విజయవాడలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్కి ధరఖాస్తుల తాకిడి పెరిగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో అభ్యర్ధులే దొరకలేదు కాంగ్రెస్కి. చాలా చోట్లు ఎవరికి పడితే వారికి టికెట్లు ఇచ్చి .. పోటీలో ఉన్నామంటే ఉన్నాం అనిపించుకుంది. అప్పట్లో ప్రచార మెటీరియల్ తీసుకెళ్లడానికి కూడా నేతలు, కార్యకర్తలు లేక పార్టీ కార్యాలయం బోసిపోయి కనిపించేది.
ఆంధ్రరత్నభవన్ని ముంచెత్తుతున్న వందల దరఖాస్తుల
అయితే ఇప్పుడు ఆంధ్రరత్నభవన్ని ముంచెత్తుతున్న వందల దరఖాస్తులతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనపిస్తోంది. అప్లికేషన్ పెట్టుకోవడానికి .. అనుచరులతో సహా వస్తున్న ఆశావహులతో పార్టీ ఆఫీసు కళకళలాడి పోతోంది. రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అధ్యక్షులుగా ముగ్గురు పనిచేసినా .. పార్టీ కార్యకలాపాలు పెద్దగా కనిపించేవి కాదు .. సదరు అధ్యక్షులు కూడా కేడర్ కనపడక .. మొక్కుబడి కార్యక్రమాలకే పరిమితం అయ్యేవారు. అయితే ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన వైఎస్ షర్మిల .. పీసీసీ ప్రెసిడెంట్ అవ్వడంతో పార్టీ ఆఫీసుకి నేతలు, కార్యకర్తల తాకిడి పెరిగిపోతోంది.
వైఎస్ షర్మిల పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు, కార్యకర్తలంతా యాక్టివ్ అయ్యారు. చాలాకాలం పొలిటికల్ స్క్రీన్పై కనిపించని మాజీ కేంద్ర మంత్రులు జెడి శీలం, పల్లంరాజులతో పాటు కేవీపీ రామచంద్రరావు, శైలజానాథ్, రఘువీరా రెడ్డి, తులసి రెడ్డి, గిడుగు రుద్రరాజు , మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ లాంటి సీనియర్ నేతలంతా షర్మిల వెన్నంటే ఉంటుండటం .. కేడర్లో కొత్త ఉత్సాహం నింపుతోంది.
దాదాపు 15 రోజుల వ్యవధిలో 175 అసెంబ్లీ స్థానాలకు 793 అప్లికేషన్లు ,25 పార్లమెంట్ స్థానాలకు 105 అప్లికేషన్లు ఆంధ్రరత్న భవన్కు చేరాయి. అప్లికేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండటంతో .. టికెల్ ఆశావహులు పెద్ద ఎత్తున్న విజయవాడ తరలివస్తున్నారు. ఇప్పటికిప్పుడు పూర్వవైభవం పొందే పరిస్థితి లేకపోయినా .. ప్రస్తుత దరఖాస్తుల కోలాహలంతో .. పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగి .. ఏపీలో పూర్తిగా చతికిల పడ్డ కాంగ్రెస్ .. ఎన్నికల రేసులో పరిగెత్తడానికి రెడీ అయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.