U19 Cricket World Cup: సౌతాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా ముందు ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. 50 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అయితే ఇదే పిచ్ పై ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ 48.5 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టు అతికష్టమ్మీద 49.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి విజయం సాధించింది.
ఇప్పుడు ఇంత కఠినమైన పిచ్ పై ఇదే ఆస్ట్రేలియా టీమ్ ఇండియా బౌలింగ్ ని సునాయాసంగా ఎదుర్కొని 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇప్పుడు లక్ష్య ఛేదన టీమ్ ఇండియాకి కష్టంగా మారనుందని విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు. ఎందుకంటే పిచ్ సెకండ్ బ్యాటింగ్ కి వచ్చేసరికి ఫాస్ట్ బౌలింగ్ కి అనుకూలంగా మారనుందని విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా ఓపెనర్ వికెట్ ని ఆదిలోనే కోల్పోయింది. రాజ్ లింబానీ బౌలింగ్ లో సామ్ కోన్ స్టాస్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ హ్యారీ డిక్సన్ (42) జాగ్రత్తగా ఆడి స్కోరు బోర్డుని ముందుకి నడిపించాడు.
కెప్టెన్ హ్యూ విబ్జన్ (48) పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత హర్జాస్ సింగ్ (55) జాగ్రత్తగా ఆడి స్కోరుని పరుగులెత్తించాడు. తర్వాత రైన్ హిక్స్ (20) అవుట్ అయ్యాడు. చివర్లో ఓలీ పీక్ (46 నాటౌట్ ) స్కోరు బోర్డుని 250 దాటించాడు.
భారత బౌలర్లలో రాజ్ లింబానీ 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు.
254 భారీ లక్ష్యంతో టీమ్ ఇండియా బ్యాటింగ్ కి దిగనుంది.